ఆనందయ్యకు జగన్ సర్కార్ షాక్- ఓమిక్రాన్ మందుకు అనుమతి లేదన్న ఆయుష్ శాఖ
నెల్లూరు ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్యకు ఏపీ ప్రభుత్వం మరోసారి షాకిచ్చింది. గతంలో ఆనందయ్య తయారు చేసిన కోవిడ్ మందును రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేస్తామని ప్రకటించి ఆ తర్వాత మాట మార్చిన ప్రభుత్వం కనీసం ఆనందయ్యను సైతం మందు పంపిణీ చేయకుండా అడ్డుకుంది. ఆ తర్వాత ఆయన్ను గృహనిర్బంధంలో కూడా ఉంచింది. ఇప్పుడు మరోసారి ఆనందయ్య ఓమిక్రాన్ వైరస్ కు మందు ఇస్తానని చెప్పగానే దాన్ని తప్పుబడుతూ ఆయుష్ శాఖ నిర్ణయం ప్రకటించింది.
ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తయారు చేసిన ఓమిక్రాన్ మందుకు తమ అనుమతి లేదని ఆయుష్ శాఖ స్పష్టం చేసింది. ఓమిక్రాన్ వైరస్ కు మందు ఇస్తున్నట్లు ఆనందయ్య దుష్ర్పచారం చేస్తున్నారని ఆయష్ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మందుకు తాము ఎలాంటి అనుమతి ఇవ్వలేదని ప్రకటించింది. ఆయుర్వేద మందు సరఫరాకు కూడా ప్రభుత్వం అనుమత ఇవ్వలేదని అధికారులు తెలిపారు. గుర్తింపులేని మందును ఆయుర్వేద వైద్యంగా భావించవద్దని రోగులకు ఆయుష్ శాఖ సూచించింది. వైద్యుల సలహాతోనే ఆయుర్వేద, హోమియో మందులు వాడాలని ఆయూష్ శాఖ ప్రకటించింది.

ప్రస్తుతానికి తాము ప్రతిపాదిస్తున్న మందుల్ని మాత్రమే వాడాలని ఆయుష్ శాఖ సూచించింది.వాస్తవానికి గతంలోనూ ఆయుష్ శాఖ ఆనందయ్య తయారు చేసిన కరోనా మందుకు ముందుగా మోకాలడ్డింది. అప్పట్లో ఉన్న పరిస్ధితుల్లో కరోనా మందుకు భారీగా డిమాండ్ ఉండటంతో తప్పనిసరి పరిస్ధితుల్లో దానికి షరతులతో అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత దాని పంపిణీకి కూడా బ్రేక్ వేసింది. చివరికి ఆనందయ్య మందు ఇప్పించాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలు కావడంతో వాటిపై విచారణ జరిపిన న్యాయస్ధానం ఆదేశాలు ఇవ్వడంతో ఆయుష్ శాఖ అనుమతి ఇచ్చింది. ఇప్పుడు మరోసారి ఓమిక్రాన్ మందు విషయంలోనూ ఆయుష్ శాఖ ఆనందయ్యకు బ్రేకులు వేసేందుకు ప్రయత్నిస్తోంది. దీనిపై ఆనందయ్య మందు తీసుకుంటున్న రోగుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.












Click it and Unblock the Notifications