సలహాదారుల వివరాలివ్వండి-అన్ని శాఖల్ని కోరిన జగన్ సర్కార్ !
ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక పదుల సంఖ్యలో సలహాదారుల నియామకాలు జరిగాయి. సీఎం జగన్ నుంచి మొదలుపెట్టి, మంత్రులు, శాఖలు, అధికారులకు సైతం సలహాదారుల్ని నియమిస్తున్నారు. వీరికి కనీసం 2 లక్షల నుంచి మొదలుపెడితే భారీగా జీత భత్యాలు కూడా చెల్లిస్తున్నారు. ఈ వ్యవహారంపై విపక్షాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో సర్కార్ స్పందిస్తోంది.
రాష్ట్రంలో ఎందరు సలహాదారులున్నారనే అంశంపై ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. శాఖలవారీగా సలహాదారుల వివరాలు సేకరిస్తోంది. ఈ మేరకు సలహాదారుల వివరాలు వెంటనే పంపాలని అన్ని శాఖలకు ఆదేశాలు వెళ్లాయి. ఇందులో సలహాదారుల పేర్లు, హోదా, ఎప్పట్నుంచి ఉన్నారనే వివరాలు పంపాలని ఆదేశించారు.హైకోర్టుకు సమర్పించేందుకు సలహాదారుల సమాచారం కోరింది. వచ్చేవారం హైకోర్టులో ఈ మేరకు విచారణలో ఈ వివరాలు అఫిడవిట్ రూపంలో సమర్పించే అవకాశం ఉంది.

తాజాగా దేవాదాయశాఖకు సలహాదారుగా జ్వాలాపురపు శ్రీకాంత్ ను నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారాల సలహాదారుగా చంద్రశేఖర్ రెడ్డి నియామకంపై హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో వీటిపై హైకోర్టు విచారణ చేపట్టింది. కుప్పలు తెప్పలుగా సలహాదారుల్ని నియమించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన హైకోర్టు..ఈ వ్యవహారంపై విచారణ చేపడతామని ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటివరకూ నియమించిన సలహాదారుల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. దీంతో ఈ మేరకు వివరాలు అందించాలని అన్ని శాఖల్ని ప్రభుత్వం కోరింది.












Click it and Unblock the Notifications