రోడ్లపైకి సచివాలయ ఉద్యోగులు-సర్కార్ హెచ్చరికలు-జగన్ జోక్యం తప్పదా ?
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ వ్యవహారం ముదురుతోంది. ఈ ఏడాది జూలైలో వారికి పెండింగ్ ఉన్న ప్రొబేషన్ ఇస్తామంటూ సీఎం జగన్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో సచివాలయ ఉద్యోగులు మండిపడుతున్నారు. దీంతో వారు విధులు బహిష్కరించి నిరసనలకు దిగుతున్నారు. అధికారులకు ప్రొబేషన్ ఇవ్వాలంటూ విజ్ఞాపనలు ఇస్తున్నారు. అయితే నిన్న వారి ప్రతినిధులతో చర్చించిన అధికారులు.. ఎలాంటి హామీ ఇవ్వలేదు. అదే సమయంలో విధుల్లో చేరకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఈ వ్యవహారంలో సీఎం జగన్ మరోసారి జోక్యం చేసుకోక తప్పని పరిస్ధితి నెలకొంది.
జగన్ మాసనపుత్రికలు
సీఎం జగన్ మాసనపుత్రికలుగా తెరపైకి వచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలపై వైసీపీ ప్రభుత్వానికి ఎన్నో ఆశలుున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను లబ్దిదారులకు చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక వ్యవస్ధపై న్యాయవివాదాలు నెలకొన్నా ప్రభుత్వం ఇన్నాళ్లు వాటిని కాపాడుకుంటూ వస్తోంది. రాబోయే ఎన్నికల నాటికి సచివాలయాలు తమకు ఓట్లు కురిపించే కేంద్రాలవుతాయని జగన్ సర్కార్ నమ్ముతోంది. దీంతో ప్రతీ సచివాలయంలో పనిచేసే 12 మంది కార్యదర్శులు ప్రభుత్వానికి అత్యంత కీలకంగా ఉన్నారు.
ప్రొబేషన్ పై మాట తప్పిన జగన్
రెండేళ్ల క్రితం విధుల్లో చేరిన సచివాలయ ఉద్యోగులకు అప్పట్లో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు గతేడాది అక్టోబర్ లోనే ప్రొబేషన్ ఖరారు చేయాల్సి ఉంది. రెండేళ్లు ప్రొబేషన్ లో రూ.15 వేల జీతంతో పనిచేసిన తర్వాత ఉద్యోగుల్ని శాశ్వతంగా విధుల్లోకి తీసుకుంటామని అప్పట్లో జగన్ హామీ ఇచ్చారు. అయితే ఈ హామీ ఇప్పటికీ నెరవేరకపోగా.. మరో ఆరు నెలలు పొడిగిస్తూ జగన్ తాజాగా తీసుకున్న నిర్ణయం వారిలో మంటపుట్టిస్తోంది. దీంతో సచివాలయ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కుతున్నారు. వీరిని నియంత్రించడం ప్రభుత్వానికి సాధ్యం కావడం లేదు.
విధులు బహిష్కరించి నిరసనలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షా పాతికవేలకు పైగా సచివాలయ ఉద్యోగులు ఇప్పుడు ప్రొబేషన్ ఖరారు కానందుకు నిరసనగా విధులు బహిష్కరించి ఆందోళనలు చేపడుతున్నారు. తొలుత అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి బయటికి వచ్చేసిన ఉద్యోగులు ఇప్పుడు రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగుతున్నారు. వీరిని సముదాయించేందుకు అదికారులు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. విధులు బహిష్కరించడమే కాకుండా ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. దీంతో వీరిని అడ్డుకోవడం కష్టసాధ్యంగా మారుతోంది.
జగన్ సర్కార్ హెచ్చరికలు
ప్రొబేషన్ ఇవ్వలేదనే కారణంతో ఇప్పటికే అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి తప్పుకుని రోడ్లపై ఆందోళనలు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగుల ప్రతినిధులతో నిన్న ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ నేతృత్వంలో అధికారులు చర్చలు జరిపారు. అయితే ఇవి ఫలించలేదు. వెంటనే ప్రొబేషన్ ఇవ్వాలని ఉద్యోగుల ప్రతినిధులు కోరారు. కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి అర్దం చేసుకుని సహకరించాలని అధికారులు సూచించారు. అయినా వారు ససేమిరా అనడంతో చర్చలు విఫలమయ్యాయి. దీంతో సచివాలయ ఉద్యోగులు నిరసనలు కొనసాగిస్తున్నారు. అయితే వెంటనే విధుల్లో చేరాలని కోరుతున్న ప్రభుత్వం చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తోంది. వీటికి ఉద్యోగులు లొంగేలా కనిపించడం లేదు.
జగన్ జోక్యం తప్పదా ?
తాజాగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీతో పాటు ఇతర సమస్యల వ్యవహారంలోూ చిక్కుముడి పడింది. అయితే సీఎం జగన్ నేరుగా జోక్యం చేసుకుని వరుసగా రెండు రోజుల పాటు ఉద్యోగ సంఘాల నేతల్ని పిలిచి చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్ధిక పరిస్ధిని వారికి నేరుగా వివరించారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వం ఇచ్చిన 23 శాతం పీఆర్సీకి అంగీకరించారు. కొంత అసంతృప్తి ఉన్నా జగన్ చెప్పారని వారు పీఆర్సీ ఫిట్ మెంట్ శాతానికి అంగీకరించారు. గతంలో వాలంటీర్లతో సమస్య ఏర్పడినప్పుడు కూడా జగన్ బహిరంగంగా ఓ ప్రకటన చేశాక సద్దుమణిగింది. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులతోనూ జగన్ చర్చించడమో, ఓప్రకటన చేయడమో కానీ చేస్తే ప్రొబేషన్ వివాదం సద్దుమణిగే అవకాశాలూ లేకపోలేదంటున్నారు.