ఎన్నికల వేళ.. ఆందోళనలతో జగన్ సర్కార్ ఉక్కిరిబిక్కిరి!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు వైసిపి ప్రభుత్వానికి తలనొప్పిగా తయారయ్యాయి. జగన్ సర్కార్ పైకి చీమలదండులా చిరు ఉద్యోగులు విరుచుకుపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అంగన్వాడీలు ఆందోళనను ఉదృతం చేసి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతుంటే, మున్సిపల్ వర్కర్లు కూడా 12 రోజులుగా సమ్మె చేస్తూ తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.
కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సమగ్ర శిక్ష కేజీబీవీ ఉద్యోగులు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. సంక్రాంతి లోపు జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే రాష్ట్రంలో విధులను ఆపేస్తామని చెబుతున్నారు. ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా తమ సమస్యల పరిష్కారం కోసం జగన్ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

అంగన్వాడీ సిబ్బంది, మున్సిపల్ కార్మికులు ఇప్పటికే సమ్మెబాట పడితే ఆ పనుల భారం అంతా గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగుల పైన పడింది. పని భారంతో వారు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయినా జగన్ సర్కార్ వీరి విషయంలో మొండి వైఖరి అవలంబిస్తుంది. చర్చలు జరిపినా వారి డిమాండ్లకు సానుకూలంగా స్పందించటం లేదు.
ఇదిలా ఉంటే సర్వ శిక్ష అభియాన్ కు సంబంధించి కేజీబీవీ టీచర్లు సుమారు 20,000 మంది సమ్మె చేస్తున్నారు. ఆశ వర్కర్లు 42 వేల మంది కూడా జీతం పెంచాలని జగన్ సర్కార్ కు అల్టిమేటం జారీ చేస్తున్నారు. సీసీఎల్ఏ కార్యాలయం వద్ద వేల మంది వీఆర్ఏలు నిన్న ధర్నా చేసి జగన్ తాను ఇచ్చిన హామీ మేరకు 500 రూపాయల డిఏ అమలు చేయాలని డిమాండ్ చేశారు .
హామీలు అమలు చేయకపోతే వీఆర్ఏలు కూడా సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తున్నారు. మరోవైపు టైటిల్ యాక్టుకు సంబంధించిన చట్టాన్ని రద్దు చేయాలని కోరుతూ కోర్టుల వద్ద న్యాయవాదుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా అనేక వర్గాల వారు, చిరు ఉద్యోగులు జగన్ సర్కార్ పై ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు అమీతుమీ తేల్చుకోవటానికి కదన రంగంలోకి దిగి ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేస్తున్నారు.












Click it and Unblock the Notifications