జగన్ సర్కారు సంచలనం-మళ్లీ పెరిగిన మద్యం ధరలు-ఈసారి 50 శాతం పెంపు-నిలిచిన విక్రయాలు
ఏపీలో వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం మందుబాబులకు మరో భారీ షాక్ ఇచ్చింది. కేంద్రం మార్గదర్శకాల నేపథ్యంలో నిన్నటి నుంచి మద్యం అమ్మకాలు ప్రారంభించిన ప్రభుత్వం ధరలను 25 శాతం పెంచింది. అయితే పెరిగిన ధరలు కూడా పట్టించుకుకుండా మందుబాబులు రోడ్లపైకి రావడంతో ప్రభుత్వం ఆగ్రహంగా ఉంది. దీంతో మద్యం వాడకాన్ని నిరుత్సాహపరిచే క్రమంలో భాగంగా మరో 50 శాతం మేర ధరలను పెంచుతూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Recommended Video
నిన్న రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల వల్ల మందుబాబులు ఎగబడిన పరిస్దితులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం వారిని నిరుత్సాహపరచడంతో పాటు భారీగా ఆదాయాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా పెరిగిన మద్యం ధరలను చూస్తే మొత్తం 75 శాతం రేట్లు పెరిగినట్లు అర్ధమవుతోంది. పెంచిన ధరలను ఇవాళ్టి నుంచే అమల్లోకి తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
మరోవైపు కొత్త ధరలను బాటిళ్లపై స్టిక్కరింగ్ చేసే వరకూ విక్రయాలు ఆపాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.. రేపటి లోగా కొత్త ధరలను బాటిళ్లపై స్టిక్కరింగ్ పూర్తి చేసి తిరిగి విక్రయాలు మొదలుపెట్టనుంది. అదే సమయంలో ఈ నెలాఖరులోగా మరో 15 శాతం దుకాణాలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే గత ఏడాది మద్యం పాలసీలో భాగంగా 20 శాతం దుకాణాలను మూసేసిన ప్రభుత్వం... ఈసారి 15శాతం షాపుల మూసివేత నిర్ణయం తీసుకోవడం సంచలనం రేపుతోంది.