త్వరలో అమ్మకానికి ఏపీ ప్రభుత్వ భూములు... కారణమిదే
ఏపీలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లో ప్రభుత్వ భూములను నేషనల్ బిల్డింగ్ అండ్ కన్ స్ట్రక్షన్ సంస్ధ ద్వారా అభివృద్ధి చేయించి విక్రయించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించిది. మిషన్ బిల్డ్ ఏపీ పథకం కింద చేపడుతున్న కార్యక్రమం త్వరలోనే పట్టాలెక్కనుంది.
ఏపీలో ప్రభుత్వ భూముల అమ్మకం- లక్ష్యమిదే
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాష్ట్రం భారీగా అప్పుల ఊబిలో కూరుకుపోయింది. కేంద్రం నుంచి విభజన చట్టం ప్రకారం రావాల్సిన గ్రాంట్లు కానీ, రెవెన్యూ లోటు కానీ భర్తీ కాకపోవడంతో గత టీడీపీ సర్కారు కానీ, ప్రస్తుత వైసీపీ సర్కారు కానీ భారీగా అప్పులు చేస్తున్నాయి. దీంతో అప్పుల భారం అంతకంతకూ పెరుగుతూ పోతోంది. దీన్ని కాస్తయినా తగ్గించుకునేందుకు మిషన్ బిల్డ్ ఏపీ పథకం కింద ప్రభుత్వ భూములను అభివృద్ధి చేసి విక్రయించాలని జగన్ సర్కార్ భావిస్తోంది.
ప్రభుత్వ భూముల అభివృద్ధి విక్రయానికి ఒప్పందం
మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో చేపడుతున్న పథకంలో భాగంగా గతేడాది నవంబర్ లో జగన్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న జగన్ సర్కార్ నేషనల్ బిల్డింగ్ అండ్ కన్ స్ట్రక్షన్ సంస్ధ ద్వారా ప్రభుత్వ భూములను అమ్మకానికి పెట్టి వాటిని అభివృద్ధి చేసి ఔత్సాహికులకు విక్రయించాలని భావిస్తోంది. దీని ప్రకారం ప్రభుత్వ భూములను జాతీయ బిల్డింగ్ అండ్ కన్ స్ట్రక్షన్ కంపెనీకి అప్పగించేలా, వాటిని అభివృద్ధి చేసి విక్రయించి తిరిగి ప్రభుత్వానికి నిధులు వచ్చేలా ఒప్పందం కుదిరింది.
రాష్ట్రంలో ఎక్కడెక్కడ భూసేకరణ
మిషన్ బిల్డ్ ఆంధ్రప్రదేశ్ పధకం కింద ఎన్.బి.సి.సికి భూముల అప్పగింత కోసం రాష్ట్రంలోని వివిధ పట్టణాలు, నగరాల్లోని ప్రధాన ప్రాంతాల్లో భూములు, భవనాలను అన్వేషిస్తున్నారు. వీటిని త్వరలోనే ఎన్.బి.సి.సికి అప్పగించనున్నారు. ఆ తర్వాత వాటిని అభివృద్ధి చేసి ఓపెన్ మార్కెట్ లో విక్రయిస్తారు. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ప్రధాన ప్రాంతాల్లో నిరుపయోగంగా ఉన్న భూములు, భవనాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. రాష్ట్రంలోని ప్రధాన ప్రాంతాల్లో ఉన్న భవనాల్లోకి అవసరమైతే ప్రభుత్వ కార్యాలయాల తరలించడం ద్వారా వాటి మార్కెట్ విలువనపెంచేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతోంది.
నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టడం, నిధుల సేకరణ లక్షం
ఏపీలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లోని నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు, స్ధలాలు, భవనాలను విక్రయించడం ద్వారా వచ్చే నిధులతో రాష్ట్ర ఖజానాకు లబ్ది చేకూరుతుంది.
అదే సమయంలో నిర్మాణ రంగానికీ కొత్త ఊపు లభిస్తుంది. ఉగాదికి 26 లక్షల పేదలకు సెంటు చొప్పున కేటాయిస్తున్న ప్రభుత్వ భూముల్లోనూ నిర్మాణ ప్రక్రియ మొదలైతే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారీగా నిధులు సమకూరే అవకాశముందని గృహ నిర్మాణశాఖ అధికారులు చెబుతున్నారు.
మొత్తం మీద బిల్డ్ ఏపీ పథకం అమలుతో రాష్ట్రంలో నిర్మాణ రంగాన్ని గాడిలో పెట్టడంతో పాటు ఆర్ధిక లోటు కూడా తీరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.