ఎగతాళి చేసి జగన్ కనుమరుగు: నారా లోకేష్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తు ఇస్తామని ఎన్నికలకు ముందు తమ పార్టీ హామీ ఇస్తే ఎగతాళి చేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దాన్ని నిజం చేయడంతో ఏం చేయాలో పాలుపోక కనుమరగయ్యారని తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
జగన్ లాంటి ఆర్థిక ఉగ్రవాదులకు రాజకీయాల్లో మనుగడ లేకుండా చేసేందుకు టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. హీరో మోటార్స్ కంపెనీతో పాటు అనేక పరిశ్రమలను రాష్ట్రానికి తీసుకుని వచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పనిలో చంద్రబాబు ఉన్నారని లోకేష్ చెప్పారు.
దేశంలోనే పటిష్టమైన విద్యార్థి సంఘంగా టిఎన్ఎస్ఎఫ్ను రూపొందించేందుకు ప్రతి కళాశాలలోనూ కమిటీలు వేయాలని సూచించారు. మంగళవారం జరిగిన ఎపి టిఎన్ఎస్ఎఫ్ మేధోమథన సదస్సులో నారా లోకేష్ ప్రసంగించారు. ప్రజలు అందించిన అధికారాన్ని పేద విద్యార్థుల సంక్షేమానికి ఉపయోగపడే విధంగా ప్రతి టిఎన్ఎస్ఎఫ్ కార్యకర్త పనిచేయాలని ఆయన సూచించారు.

చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వైపు పయనిస్తుంటే దురదృష్టవశాత్తు కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ విధ్వంసం వైపు నడుస్తోందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత రావుల చంద్రశేఖర రెడ్డి అన్నారు. సమకాలీన రాజకీయాలను విద్యార్థులు శాస్త్రీయంగా అవగాహన చేసుకుని న్యాయం వైపు నిలబడాలని టిడిపి ఆంధ్రప్రదేశ్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు రోజుల తరబడి కుటుంబానికి దూరంగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారని ప్రశంసించారు.
పదేళ్ల కాంగ్రెసు పాలనలో నాశనమైన విద్యారంగాన్ని పునర్నిర్మించుకునే బాధ్యత విద్యార్థులదేనని మాజీ ఐఎఎస్ అధికారి లక్ష్మినారాయణ అన్నారు. అభివృద్ధి దృక్పథంతో చంద్రబాబు పాలన నడుస్తుంటే విద్వేషం పునాదులపై కెసిఆర్ పాలన సాగుతోందని టిఎన్ఎస్ఎఫ్ జాతీయాధ్యక్షుడు ఆంజనేయ గౌడ్ అన్నారు. త్వరలో రెండు రాష్ట్రాల్లో లక్షలాది మంది విద్యార్థులతో టిఎన్ఎస్ఎఫ్ భారీ బహిరంగ సభలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. 20 లక్షల మంది విద్యార్థులను క్రియాశీలక సభ్యులుగా చేర్పించేందుకు నవంబర్ 1నుంచి సభ్యత్వ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications