పరోక్షంగా 'పవన్'ను టార్గెట్ చేసిన జగన్.. బహిరంగ లేఖలో ఆ ప్రస్తావన..
నిరుద్యోగ భృతి హామిపై ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన జగన్.. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో కలిసి ప్రధాని నరేంద్రమోడీ, పవన్ సైతం ప్రచారంలో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు.
విజయవాడ: గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను ఇంతదాకా నిలబెట్టుకోలేని టీడీపీ ప్రభుత్వాన్ని జనం ముందు ఎండగట్టాలని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు ప్రభుత్వ వైఫల్యాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయన నిరుద్యోగ అస్త్రాన్ని సంధించారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోతున్నా.. ఇంతవరకు నిరుద్యోగ భృతి హామిని నిలబెట్టుకోలేకపోయిందని బహిరంగ లేఖ ద్వారా టీడీపీ తీరును జగన్ ఎండగట్టారు. అయితే ఇదే లేఖలో ఆయన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రస్తావించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
నిరుద్యోగ భృతి హామిపై ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన జగన్.. గత ఎన్నికల ప్రచారంలో చంద్రబాబుతో కలిసి ప్రధాని నరేంద్రమోడీ, పవన్ సైతం ప్రచారంలో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేశారు. దీన్నిబట్టి అటు చంద్రబాబుతో 'పవన్'ను కూడా జగన్ టార్గెట్ చేశారన్న వాదనలు వినిపస్తున్నాయి.

అయితే ఇప్పటివరకు జగన్, పవన్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్న దాఖలా లేదు. ఇక లేఖలో పవన్ పేరును ప్రస్తావించడాన్ని బట్టి చూస్తే.. ఎన్నికల హామిలకు ప్రభుత్వంతో పాటు టీడీపీకి మద్దతునిచ్చిన పవన్ కూడా బాధ్యత వహించాలని జగన్ పరోక్షంగా ప్రస్తావించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాగా, నిరుద్యోగ భృతిపై ప్రభుత్వం ఇచ్చిన హామి మేరకు రూ.2వేలు చొప్పున ప్రతీ నిరుద్యోగికి చెల్లించాలని, ఆ లెక్కన ప్రభుత్వం 1.15 లక్షల కోట్లు బకాయిలు పడిందని జగన్ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ వర్గాలు మాత్రం జగన్ రాసిన బహిరంగ లేఖను తిప్పికొడుతున్నాయి.












Click it and Unblock the Notifications