జగన్ సరికొత్త ట్విస్ట్ : అధికారంలోకి వచ్చినా..పాలన అక్కడ కాదా..! ఏం చేయాలో నిర్ణయించారా..!!
ఈ సారి అధికారం మాదే. లాండ్ స్లైడ్ విక్టరీ సాధిస్తాం. ఏపీలో పోలింగ్ పూర్తయిన తరువాత వైసీపీ అధినేత జగన్ ధీమా ఇది. అదే విధంగా ఏపీలో ప్రచారమూ జరుగుతోంది. తమదే అధికారం అని టీడీపీ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే, జగన్ అంచనా వేస్తున్నట్లుగా అధికారంలోకి వస్తే ఏం చేస్తారనేది వైసీపీలో విస్తృత చర్చ సాగుతోంది. ఇందులో భాగంగా కొత్త విషయం ప్రచారంలోకి వచ్చింది. వైసీపీ ఊహిస్తున్నట్లుగా జగన్ అధికారంలోకి వస్తే..పాలన ఎక్కడి నుండి చేస్తారంటే..దానికి పార్టీ ముఖ్యుల నుండి ఆసక్తి కర సమాధానం వస్తోంది...

ఆ సచివాలయానికి మాత్రం నో..
ఏపీలో అధికారం ఖాయమని వైసీపీ భారీ అంచనాల్లో ఉంది. ఇదే సమయంలో ఈనెల 23న ఫలితాలు రాగానే.. ఈనెల 26న ప్రమాణ స్వీకార ముహూర్తమంటూ ఓపెన్గానే చెబుతున్నారు. ఇదే సమయంలో మరో అడుగు ముందుకేసారు. నిజంగా వైసీపీ నేతలు అంచనా వేస్తున్నట్లుగా అధికారంలోకి వచ్చినా..జగన్ తన కార్యాలయం మాత్రం ప్రస్తుతం అమరావతి పరిధిలోని వెలగపూడిలో ఉన్న సచివాలయంలో ఉండదని చెబుతున్నారు. జగన్ సైతం ప్రస్తుత సచివాలయం నుండి కాకుండా..శాశ్వత సచివాలయ నిర్మాణం త్వరిత గతిన పూర్తయ్యేలా చూస్తారని చెబుతున్నారు. అప్పటి వరకు క్యాంపు కార్యాలయం నుండే తన కార్యాలయం కొనసాగేలా చూడనున్నారని పార్టీ సీనియర్ల అంచనా. సచివాలయానికి వెళ్లినా.. అక్కడ కార్యాలయం మాత్రం పూర్తి స్థాయిలో వినియోగించరని..మంత్రులు..అధికారులు.. ఉద్యోగులు మాత్రం శాశ్వత సచివాలయ నిర్మాణం పూర్తయ్యే వరకూ అక్కడే ఉంటారని వివరిస్తున్నారు.

అసలు కారణం ఏంటంటే..
తాత్కాలిక సచివాలయం పేరుతో ప్రస్తుతం ఉన్న భవనాలు నిర్మించారు. ఇందు కోసం వందలాది కోట్లు ఖర్చు చేసారు. దీని పైన విపక్ష నేతగా జగన్ అనేక ఆరోపణలు చేసారు. వర్షం పడితే సచివాలయంతో పాటుగా అసెంబ్లీ భవనాల్లోనూ వర్షపు నీరు లీక్ అవుతుంది. అసెంబ్లీలోని జగన్ ఛాంబర్లో వర్షపు నీరు వస్తే పైన కొందరు కుట్ర చేసి పైపులు కోసారని..దీంతో నీరు జగన్ ఛాంబర్లోకి వచ్చిందంటూ దీని పైన సీఐడి విచారణ వేసారు. ఇక, అక్కడ నిర్మాణాలు నాసిరకమంటూ నిర్మాణ సంస్థలతో ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కై అవినీతికి పాల్పడ్డారనేది వైసీపీ ఆరోపణ.
దీంతో..అదే భవనంలో తాను పాలన కొనసాగిస్తే..ఆ నిర్మాణాలను తాను అంగీకరించినట్లువుతందనే జగన్ భావనగా కనిపిస్తోంది. దీంతో..పాలనకు ఎక్కడా ఇబ్బంది లేకుండా ప్రత్నామ్నాయ ఏర్పాట్లు చేయటం సమస్య కాదని వైసీపీ నేతలు చెబుతున్నారు. దీంతో..జగన్ కేవలం సందర్శనకు మినహా పాలనకు మాత్రం ప్రస్తుత సచివాలయం వినియోగించే అవకాశం లేదని తేల్చి చెబుతన్నారు నేతలు.

రాజధాని అక్రమాల పైన సీరియస్గా
ఇక, తొలి నుండి రాజధాని పేరుతో టీడీపీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందంటూ ఆరోపిస్తున్న వైసీపీ అధినేత జగన్ తాము అధికారంలోకి వస్తే వీటి పైన విచారణకు సిద్దమని ఇప్పటికే జాతీయ చానళ్ల ఇంటర్వ్యూల్లో స్పష్టం చేసారు. దీంతో..రాజధాని విషయంలో మాత్రం జగన్ ఆచితూచి నిర్ణయాలు చేయనున్నారు. అదే విధంగా ఇప్పటి వరకూ ఎక్కడా అమరావతి గురించి మాట్లాడిన ప్రత్యేక సందర్భాలు లేవు. అదే సమయంలో రాజధాని మార్పు లేదనే విషయం మాత్రం ఇప్పటికే స్పష్టం చేసారు. అయితే, కొన్ని నిర్ణయాల మార్పు పైన మాత్రం జగన్ దృష్టి సారిస్తారని వైసీపీ నేతలు తేల్చి చెబుతున్నారు.












Click it and Unblock the Notifications