జగన్కు మరో గోల్డెన్ ఛాన్స్ - బీజేపీకి మరో దారి లేదు: వైసీపీనే దిక్కు..!!
అమరావతి: దేశ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఒక్కటొక్కటిగా చోటు చేసుకుంటోన్నాయి. క్రమంగా అవి కాస్తా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతోన్నాయి. పార్లమెంట్ ఉభయ సభల్లో అత్యధిక సంఖ్యాబలం ఉండటమే దీనికి కారణం. క్రమంగా దేశ రాజకీయాలను తన చుట్టూ తిప్పుకొనే అవకాశాలు కూడా వైఎస్ఆర్సీపీ అగ్ర నాయకత్వానికి లేకపోలేదు. దీనిపై ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తి రేపుతోంది.

బిహార్ పరిణామాలతో..
బిహార్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలు- వైఎస్ఆర్సీపీ అనుకోని వరంలా మారాయి. మొన్నటిదాకా ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీగా కొనసాగిన నితీష్ కుమార్ సారథ్యంలోని జనత దళ్ (యునైటెడ్) అనుకోని పరిస్థితుల మధ్య కూటమి నుంచి బయటికి వచ్చింది. భారతీయ జనతా పార్టీతో ఉన్న పొత్తును తెగదెంపులు చేసుకుంది. ప్రతిపక్ష రాష్ట్రీయ జనతాదళ్-కాంగ్రెస్-వామపక్షాలతో పాటు ఏడు పార్టీలతో కలిసి బిహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

జేడీయూకు చెందిన అయిదుమందీ..
సంకీర్ణ కూటమి నుంచి జేడీయూ వైదొలగడంతో రాజ్యసభలో ఎన్డీఏ మైనారిటీలో పడింది. జేడీయూకు చెందిన అయిదుమంది రాజ్యసభ సభ్యులు ఇక ప్రతిపక్షం వైపు కొనసాగుతారు. రాజ్యసభ వైస్ ఛైర్మన్ హరివంశ్ కూడా ఇక ప్రతిపక్ష పాత్రకే పరిమితమౌతారు. రాజ్యసభ సంఖ్యాబలం 237. కాగా ఇందులో ఎనిమిది ఖాళీలు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్-4, త్రిపుర-1తో పాటు మరో ముగ్గురు నామినేట్ సభ్యుల స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది.

మైనారిటీలో ఎన్డీఏ..
మెజారిటీ మార్క్ను అందుకోవాలంటే 119 సభ్యుల బలం అవసరమౌతుంది. ప్రస్తుతం ఎన్డీఏ రాజ్యసభలో ఉన్న సభ్యుల సంఖ్యాబలం 114. ఇందులో బీజేపీకి సొంతంగా ఉన్న సభ్యుల బలం 91. ఏఐఏడీఎంకేకు చెందిన నలుగురూ బీజేపీకే మద్దతు ఇస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో నుంచి జేడీయూకు ఉన్న అయిదుమంది సభ్యులు గుడ్బై బయటికి వెళ్లడంతో ఈ సంఖ్య 109కి పడిపోయింది. అంటే- మెజారిటీకి 10 స్థానాల దూరంలో నిలిచింది ఎన్డీఏ.

వైసీపీకి అనుకోని అవకాశం..
10 స్థానాలు దూరంగా నిల్చోవాల్సి రావడం.. వైఎస్ఆర్సీపీకి ఓ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చినట్టయింది. కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలంటే- వైఎస్ఆర్సీపీతో పాటు ఒడిశాలో అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ సహకారాన్ని కూడా తీసుకోక తప్పని పరిస్థితి ఎన్డీఏ/బీజేపీకి ఏర్పడింది. కీలక బిల్లుల భవితవ్యం అనేది ఇకపై వైఎస్ఆర్సీపీ సభ్యుల చేతుల్లో ఉంటుందనడంలో సందేహాలు అక్కర్లేదు.

వైసీపీ సభ్యులు వీరే..
వైఎస్ఆర్సీపీకి తొమ్మిదిమంది సభ్యుల బలం ఉంది రాజ్యసభలో. వీ విజయసాయి రెడ్డి, ఆర్ కృష్ణయ్య, ఎస్ నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమళ్ నథ్వాని, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీలో ఉన్నారు. ఇకపై రాజ్యసభలో కీలక బిల్లులను ఆమోదింపజేసుకోవాలనుకుంటే మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. వైఎస్ఆర్సీపీ సహకారాన్ని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.












Click it and Unblock the Notifications