పంచాయతీలకు జగన్ సర్కార్ మరో ఝలక్-ఈసారి పీడీ ఖాతాలకు రూ.379 కోట్లు-కోర్టుకు సర్పంచ్ లు ?
ఏపీలో వైసీపీ ప్రభుత్వం వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధుల్ని పీడీ ఖాతాలకు మళ్లిస్తూనే ఉంది. వీటికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిపించినా ప్రయోజనం లేదు. ఈ విషయం మరోసారి రుజువైంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్ధిక సంఘం నిధుల్ని పంచాయతీలకు విడుదల చేయగా.. రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా వాటిని పీడీ ఖాతాలకు మళ్లించేలా మెమో జారీ చేసింది. దీంతో సర్పంచ్ లు గగ్గోలు పెడుతున్నారు.

పంచాయతీలకు ఝలక్
ఏపీలో పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఇచ్చే ఆర్దిక సంఘం నిధుల్ని వాటికి కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఖాతాలకు మళ్లిస్తోంది. గతంలో ఇలా పలుమార్లు చేసిన మళ్లింపులపై సర్పంచ్ లు హైకోర్టును సైతం ఆశ్రయించారు. కేంద్ర ప్రభుత్వం, కాగ్ కూడా అభ్యంతరాలు తెలిపాయి. చివరికి పంచాయతీలకు సొంత బ్యాంకు ఖాతాలు తెరిపించాయి. అయినా ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గలేదు. వాటిలో జమ చేయాల్సిన నిధుల్ని మరోసారి పీడీ ఖాతాల్లో మళ్లించేసుకుంటోంది.

ఈసారి రూ.379 కోట్ల మళ్లింపు
కేంద్ర ప్రభుత్వం తాజాగా పంచాయతీలకు ఇచ్చేందుకు 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.379 కోట్లు విడుదల చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటిని పంచాయతీ బ్యాంకు ఖాతాల్లో కాకుండా తమ పీడీ ఖాతాల్లో సర్దుబాటు చేయాలంటూ జారీ చేసిన మెమో తాజాగా వెలుగుచూసింది. దీన్ని బట్టి చూస్తుంటే ఈసారి కూడా ఈ నిధులు పంచాయతీలకు కాకుండా పీడీ ఖాతాల్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఈ నెల19న జారీ చేసిన మెమోలో ఆర్ధిక సంఘం నిధుల సర్దుబాటుకు సంబంధించిన జీవీల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఆ పద్దుల కింద మళ్లింపులు
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల బ్యాంకు ఖాతాల్లో వేయమంటూ కేంద్రం ఇచ్చిన నిధుల్ని తమ పీడీ ఖాతాల్లో వేసుకునేందుకు ఓ మార్గం వెతుక్కుంది. పంచాయతీలు ప్రభుత్వానికి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల కింద వీటిని జమ చేసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ నిధుల్నివిద్యుత్ సంస్ధల ఖాతాలకు మళ్లించనున్నట్లు తెలుస్తోంది. తద్వారా డిస్కంలకు చెల్లించాల్సిన మొత్తాలకు బదులుగా వీటిని తీసుకుంటున్నట్లు సమాచారం. అప్పుడు ఎవరూ ప్రశ్నించేందుకు వీలుండదనేది ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది.

మళ్లీ హైకోర్టుకు సర్పంచ్ లు ?
పంచాయతీలకు ఆర్ధిక సంఘం నిధుల్ని కేంద్రం కేటాయిస్తూ,వాటి కోసం బ్యాంకు ఖాతాల్ని తెరిపించినా సరే ప్రభుత్వం మాత్రం పీడీ ఖాతాల్లోనే నిధులు మళ్లించుకోవడంపై పంచాయతీరాజ్ ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం తక్షణం ఆ రూ.379 కోట్ల నిధుల్ని పంచాయతీ ఖాతాల్లో జమ చేయకపోతే హైకోర్టును ఆశ్రయించనున్నట్లు ఏపీ పంచాయతీ రాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ వ్యవస్ధను నిర్వీర్యం చేసేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన మండిపడ్డారు.












Click it and Unblock the Notifications