జగన్ సర్కార్ పై కేంద్రం సీరియస్ ? దిద్దుబాటు చర్యలు- మీకు వ్యతిరేకం కాదని లేఖ
రెండేళ్ల క్రితం ఏపీలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో సత్సంబందాలు నెరుపుతున్న వైసీపీ సర్కార్.. తాజాగా ఓ విషయంలో మాత్రం కేంద్రానికి ఆగ్రహం తెప్పించినట్లు తెలుస్తోంది. ఓ సున్నితమైన అంశంపై ఏపీ తీసుకున్న కఠిన నిర్ణయం కేంద్రానికి రుచించలేదనే వార్తలు ప్రభుత్వంలో కలవరం రేపినట్లు సమాచారం. దీంతో వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఇందులో మీకు వ్యతిరేకం కాదంటూ వివరణ కూడా ఇచ్చింది. దీంతో ఈ వ్యపహారం చర్చనీయాంశమవుతోంది.
కేంద్రంతో జగన్ సంబంధాలు
ప్రస్తుతం దేశంలో ఏ బీజేపీయేతర ముఖ్యమంత్రికీ సాధ్యం కాని రీతిలో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ తో ఏపీ సీఎం జగన్ సత్సంబంధాలు నెరుపుతున్నారు. ఎన్డీయే సర్కార్ కు నమ్మకమైన మిత్రపక్షంగా మారిపోయారు. కేంద్రంలో చేరలేదనే కానీ ఎన్డీయే సర్కార్ కు ఎప్పుడు అవసరం వచ్చినా తెలుసుకుని మరీ స్పందిస్తున్న తీరు కరోనా వ్యాక్సిన్ల వ్యవహారంలోనే అందరికీ అర్ధమైంది. అయినా కేంద్రం నుంచి విభజన హామీలతో సహా ఏ ఒక్క కీలకమైన సాయాన్నీ అందుకోలేని ముఖ్యమంత్రి కూడా జగనే అంటే అతిశయోక్తి కాదు.
జగన్ సర్కార్ పై కేంద్రం సీరియస్
తమతో సత్సంబంధాలు నెరుపుతూ, పార్లమెంటులో అవసరాలకు అండగా నిలుస్తున్న ఏపీ సర్కార్ అధినేత జగన్ విషయంలో కేంద్రం తాజాగా ఓ విషయంలో సీరియస్ అయినట్లు తెలుస్తోంది. ఏపీ-తెలంగాణ మధ్య సాగుతున్న వాటర్ వార్ పై కేంద్రం స్పందించే లోపే ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం కేంద్రానికి కోపం తెప్పించినట్లు సమాచారం.
తెలంగాణతో నెలకొన్న ఈ సున్నితమైన సమస్యపై ఏమాత్రం తొందరపడినా ఇరు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు తప్పవని భావిస్తున్న కేంద్రం సంయమనం పాటిస్తోంది. త్వరలో అపెక్స్ కౌన్సిల్ భేటీకి కూడా సిద్దమవుతోంది. ఇలాంటి తరుణంలో జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించడం కేంద్రానికి ఆగ్రహం తెప్పించినట్లు సమాచారం.
జగన్ సర్కార్ దిద్దుబాటు చర్యలు
కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ దూకుడుగా వ్యవహరిస్తున్నా కేంద్రం కట్టడి చేయడం లేదనే కారణంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్.. కేంద్రం ఆగ్రహం నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు దిగింది. తెలంగాణ సర్కార్ సాగునీటి అవసరాలను పట్టించుకోకుండా విద్యుత్ ఉత్పత్తి చేపడుతోందని, ఈ పరిస్ధితుల్లో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునేందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరో మార్గం లేదని కేంద్రానికి రాసిన లేఖలో ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు.
అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేపట్టడం ద్వారా విలువైన నీటిని తెలంగాణ సర్కార్ సముద్రం పాలు చేస్తోందని సీఎస్ తన లేఖలో ఆరోపించారు. వెంటనే కృష్ణాబోర్డును ఏర్పాటు చేయడం ద్వారా ప్రాజెక్టుల్లో నీటి వాటా తేల్చి, వాటికి కేంద్ర బలగాలతో భద్రత కల్పించాలని ఏపీ సర్కార్ కేంద్రాన్ని కోరింది.
కేంద్రానికి వ్యతిరేకం కాదన్న జగన్ సర్కార్
కృష్ణా ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ సర్కార్ దూకుడుపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయించడం కేంద్రానికి వ్యతిరేకం కాదని ఏపీ ప్రభుత్వం తమ లేఖలో కేంద్రానికి వివరించింది. కేంద్రానికి వ్యతిరేకంగా ఈ పిటిషన్ వేయలేదని, ఇది న్యాయపరంగా తమకు దక్కాల్సిన హక్కుల్ని కాపాడుకునేందుకే అని సీఎస్ తన లేఖలో పేర్కొన్నారు. ఇది కేంద్రం తమ న్యాయబద్ధమైన విధులు నిర్వర్తించేలా తోడ్పడుతుందని కూడా వివరించారు. తద్వారా తాము కేవలం తమకు రావాల్సిన నీటి వాటా కోసమే సుప్రీంకోర్టును ఆశ్రయించామే తప్ప కేంద్రానికి వ్యతిరేకం కాదని జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.