జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం-600 పోలీసు స్టేషన్లలో మరింత నిఘా-త్వరలో టెండర్లు
అమరావతి : దేశవ్యాప్తంగా పోలీసింగ్ లో వస్తున్న మార్పులు, ప్రజలకు పోలీసు వ్యవస్ధ చేరువ చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో భాగంగా సుప్రీంకోర్టు తాజాగా అన్ని రాష్ట్రాలకు కీలక సూచనలు చేసింది. ఇందులో ప్రతీ పోలీసు స్టేషన్ లోనూ, అన్ని విభాగాల్లోనూ సీసీ కెమెరాల ఏర్పాటు కీలకమైనది. దీంతో సుప్రీంకోర్టు సూచనల ప్రకారం ఏపీలోనూ ప్రభుత్వం అన్ని పీఎస్ లలోనూ సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తోంది. తొలిదశలో 600 స్టేషన్లలో సీసీ కెమెరాలు అమర్చబోతున్నారు.
పోలీసు స్టేషన్లలో సీసీ నిఘా
పోలీసు వ్యవస్థ పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనాన్ని పెంచేందుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. పోలీసులు, ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపర్చడంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సీసీ టీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పోలీస్ స్టేషన్లలోని అన్ని ముఖ్యమైన విభాగాల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కేంద్రంతో పాటు అన్ని రాష్ట్రాలను ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈమేరకు రెండు దశల్లో వాటి ఏర్పాటుకు జగన్ సర్కార్ ప్లాన్ సిద్దం చేసింది.
మూడు నెలల్లో 600 స్టేషన్లలో
రాష్ట్రంలో వచ్చే మూడు నెలల్లో 600 పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి ఏపీ పోలీస్ టెక్నికల్ సర్వీసెస్ విభాగం టెండర్లను పిలిచింది. ఆ సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించిన తర్వాత మిగతా స్టేషన్లలో కూడా ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ భావిస్తోంది. ఏపీ ప్రభుత్వం 2020లో రాష్ట్రంలోని 500 పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. అప్పట్లో పురుషులు, మహిళల లాకప్ రూమ్లలో వాటిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్లలో అక్రమ నిర్బంధాలను నిరోధించి మానవ హక్కుల పరిరక్షించడం, సిటిజన్ చార్టర్కు అనుగుణంగా పోలీసు సిబ్బంది ప్రవర్తిస్తున్నారా? లేదా అనేది పర్యవేక్షించేందుకు అన్ని చోట్లా ఏర్పాటు చేయబోతున్నారు.
ఎక్కడెక్కడంటే ?
రాష్ట్రంలోని మొత్తం 900 పోలీస్స్టేషన్లలో రెండు దశల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కానున్నాయి. నేరాల రేటు ఎక్కువగా ఉన్న 600 స్టేషన్లలో తొలిదశలో వీటిని ఏర్పాటు చేస్తారు. తర్వాత రెండో దశలో మిగిలిన స్టేషన్లలో ఏర్పాటు చేస్తారు. ప్రతి పోలీస్ స్టేషన్లో 10 సీసీ టీవీ కెమెరాలు ఉంటాయి. ప్రవేశద్వారం, హాలు, రిసెప్షన్ రూమ్, స్టేషన్ ఆఫీసర్ రూమ్, రైటర్ రూమ్, ఆయుధాలు, సాక్ష్యాధారాల రూమ్, పురుషుల లాకప్, మహిళల లాకప్, కంప్యూటర్ రూమ్, పార్కింగ్ ఏరియాలలో వీటిని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గతంలో లాకప్ రూమ్లలో ఒక్కో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన చోట ప్రస్తుతం 8 చొప్పున ఏర్పాటు చేయనున్నారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన సీసీ టీవీ కెమెరాలను వాడబోతున్నారు. ఆడియో, వీడియో ఫుటేజీలతో పాటు రాత్రివేళల్లో కూడా స్పష్టంగా రికార్డ్ చేసేలా నైట్ విజన్ ఫీచర్లతో కూడిన సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. కనీసం 18 నెలలపాటు ఫుటేజ్ ఉండేలా చూస్తారు.