ఉద్యోగులకు జగన్ మరో గుడ్ న్యూస్-ఇక ఇతర రాష్ట్రాల్లోనూ ఆ సేవలు..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు సాయం అందించిన ఉద్యోగులకు అధికారంలోకి వచ్చాక జగన్ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వారిని సంతృప్తి పరిచేందుకు సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఇప్పటికే అందిస్తున్న కీలక సేవల్ని పొరుగు రాష్ట్రాల్లోనూ వర్తింపజేయాలని నిర్ణయించింది.
ప్రభుత్వం ఇప్పటికే తమ ఉద్యోగులకు ఆరోగ్య సేవల్ని ఈహెచ్ఎస్ కార్డులతో రాష్ట్రంలో అందిస్తోంది. ఆరోగ్యశ్రీ తరహాలో అందిస్తున్న ఈ సేవల ద్వారా ఉద్యోగులకు, వారి కుటుంబాలకు మేలు జరుగుతోంది. ఈ నేపథ్యంలో వాటిని ఆరోగ్యలాగే ఇతర రాష్ట్రాలకూ విస్తరిస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై ఆరోగ్యశ్రీ లాగే ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగులు మెరుగైన వైద్య సేవలు తీసుకునే అవకాశం లభించింది. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకూ ఉద్యోగులకు వర్తింపజేయని 565 చికిత్సలను కూడా ఇందులో అందుబాటులోకి తేవాలని కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైద్యారోగ్యశాఖ కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. మరోవైపు ఈహెచ్ఎస్ ద్వారా ఉద్యోగులు పొందిన సేవల బిల్లుల్ని ఆరోగ్యశ్రీ తరహాలోనే 21 రోజుల్లో ఆటో డెబిట్ స్కీమ్ తో చెల్లింపులు చేసేందుకు కూడా ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఉద్యోగుల ఆరోగ్య బిల్లుల్ని వెంటనే చెల్లించేందుకు వీలు కలుగుతుంది. అప్పుడు ఆస్పత్రులు కూడా ఉద్యోగులకు పూర్తిస్ధాయిలో సేవలు ఇచ్చేందుకు అవకాశం దొరుకుతుంది. నెట్ వర్క్ ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ కార్డుల సమన్వయానికి ఆరోగ్యమిత్రలకు ఆదేశాలు ఇస్తామని కూడా ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది.
Recommended Video
ఉద్యోగసంఘాలతో మంత్రుల కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేస్తోంది. అలాగే ఉద్యోగుల మెడికల్ రీయింబర్స్ మెంట్ స్కీం ను మరో ఏడాది పాటు పొడిగేంచేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.