విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్పు ? సర్కార్ క్లారిటీ ఇదే !
ఏపీలో విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మారుస్తున్నట్లు వస్తున్న వార్తలపై ప్రభుత్వం ఇవాళ క్లారిటీ ఇచ్చింది. విజయవాడ కార్పోరేషన్ తో పాటు స్ధానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఈ మేరకు ప్రకటనలు చేశారు.
విజయవాడలో చారిత్రక తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం దశాబ్దాలుగా ఎన్నో సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాలకు వేదికైంది. అలాంటి కళాక్షేత్రం పేరు కాస్తా తాజాగా కేవలం కళాక్షేత్రంగా మాత్రమే దర్శనమిస్తోంది. దీంతో తుమ్మలపల్లి వారి పేరును, క్షేత్రయ్య పేరును ప్రభుత్వం ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్పు తరహాలోనే మార్చినట్లు ప్రచారం జరుగుతోంది.
విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్పుపై పలు పత్రికల్లోనూ వార్తలు వచ్చాయి. దీనిపై విజయవాడ నగర పాలక సంస్ధతో పాటు స్ధానిక వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు కూడా ఇవాళ స్పందించారు. వీఎంసీ ఈ మేరకు ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్పు ఉద్దేశం తమకు లేదని ఇందులో కార్పోరేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు పలు పత్రికల్లో వచ్చిన కథనాలు అవాస్తవమని తెలిపింది. అయితే పూర్తి పేరు స్ధాయిలో కేవలం కళాక్షేత్రం అని మాత్రమే బోర్డు ఎందుకు దర్శనమిస్తోందన్న దానిపైనా స్పష్టత ఇచ్చింది.

తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం అనే నేమ్ బోర్డు తయారీలో ఉన్నందున..కేవలం కళాక్షేత్రం పేరు హైలెట్ చేస్తూ బోర్డు ఉంచామని, అతి త్వరలో ఆ భవనానికి పూర్తి పేరుతో బోర్డు ఏర్పాటు చేస్తామని విజయవాడ నగరపాలక సంస్ధ ప్రకటనలో వెల్లడించింది. మరోవైపు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మార్చే పరిస్థితి లేదని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు మారుస్తున్నట్లు ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మొద్దని ఎమ్మెల్యే అన్నారు. తుమ్మలపల్లి అన్నపూర్ణమ్మ, హరినారాయణ గారి పేరు మీదే తుమ్మలపల్లి కళాక్షేత్రం పేరు ఉంటుందని ఈ సందర్భంగా విజయవాడలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు క్లారిటీ ఇచ్చారు.













Click it and Unblock the Notifications