ఆగస్టు తర్వాతే మూడు రాజధానుల చర్చ ? హైకోర్టు తరలింపుపైనా ! అప్పుడే ఎందుకంటే?
ఏపీలో హైకోర్టు తీర్పు నేపథ్యంలో మూడు రాజధానుల ప్రక్రియ మూలనపడింది. అమరావతినే రాజధానిగా పరిగణించి అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో మూడు రాజధానులపై ప్రభుత్వం మాట్లాడటమే మానేసింది. హైకోర్టు తీర్పు తర్వాత మొదట్లో అసెంబ్లీలో కొత్త బిల్లు ప్రవేశపెడతామని హంగామా చేసిన ప్రభుత్వం.. అనంతరం దానిపై వెనక్కి తగ్గింది. తాజాగా పార్లమెంటులో కేంద్రం కూడా హైకోర్టు తరలింపు వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోనే ఉందని చెప్పేసింది. దీంతో ఆగస్టులో మూడు రాజధానుల వ్యవహారం తెరపైకి తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మళ్లీ తెరపైకి మూడు రాజధానులు?
ఏపీలో మూడు రాజధానుల ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చేలా కనిపిస్తోంది. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు, రాష్ట్రంలో మారుతున్న రాజకీయాలు, భవిష్యత్ ప్రయోజనాలు.. ఇలా పలు అంశాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారాన్ని హైకోర్టు తీర్పు నేపథ్యంలో తాత్కాలికంగా పక్కనబెట్టిన ప్రభుత్వం.. తిరిగి తెరపైకి తెచ్చేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు పరిస్ధితి ఏంటనే చర్చ కూడా సాగుతోంది. ఇప్పటికే హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలు కీలకంగా మారాయి.
హైకోర్టు తరలింపుపై కేంద్రం క్లారిటీ
మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు మార్చే విషయంలో నిన్న కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. గతంలోనూ ఇదే విషయం చెప్పినా మరోసారి దీనిపై స్పష్టత ఇచ్చింది.
ఈ వ్యవహారంపై తమ వద్ద పెండింగ్ ప్రతిపాదనలేవీ లేవని, హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం కలిసి మాట్లాడుకుని దీనిపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. దీంతో వైసీపీ సర్కార్ కోర్టులోకి మళ్లీ బంతి వచ్చినట్లయింది. ఈ నేపథ్యంలో త్వరలో మూడు రాజధానుల ప్రక్రియను మొదలుపెట్టే దిశగా జగన్ సర్కార్ అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఆగస్టులోనే ముహుర్తం?
ఇప్పటికే అమరావతిపై హైకోర్టు తీర్పును పూర్తిస్ధాయిలో అమలుచేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం లేదు. దీనిపై జనంలోనే అనుమానాలు పెరుగుతున్నాయి.
మరోవైపు సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ గా ఉన్న ఎన్వీ రమణ ఆగస్టులోనే రిటైర్ అవుతున్నారు. ఆగస్టు 26న ఆయన రిటైర్ మెంట్ ఉంది. దీంతో ఆ తర్వాత అంటే ఆగస్టు చివర్లో మూడు రాజధానుల ప్రక్రియపై తిరిగి జగన్ సర్కార్ ముందడుగు వేయబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ప్రస్తుతం హైకోర్టులో చోటు చేసుకుంటున్న పరిణామాలు, రైతుల పిటిషన్లు, కేంద్రం కర్నూలుకు హైకోర్టు తరలింపుపై చేసిన వ్యాఖ్యలు, త్వరలో ఎదుర్కోబోయే ఎన్నికలు ఇలా ఏ విధంగా చూసినా తాము మొదలుపెట్టిన మూడు రాజధానుల వ్యవహారాన్ని మళ్లీ తెరపైకి తెచ్చి ఓ కొలిక్కి తెచ్చేందుకు జగన్ సర్కార్ ఆగస్టు ముహుర్తం ఖరారు చేస్తున్నట్లు తెలుస్తోంది.