ఏపీలో మరిన్ని పెన్షన్ కోతలు ? రెండో విడత తనిఖీలు-ఆన్ లైన్లో కనిపించకుండా జాగ్రత్తలు
ఏపీలో వైసీపీ సర్కార్ సామాజిక పింఛన్లలో మరిన్ని కోతలకు సిద్ధమైంది. ఇప్పటికే ఆధార్ లింకింగ్, కొత్త నిబంధనలు, తనిఖీల ద్వారా భారీ ఎత్తున పింఛన్లు తొలగించిన సర్కార్ ఇప్పుడు రెండో విడత తనిఖీలకు ఆదేశాలు ఇవ్వడం కలకలం రేపుతోంది. ఇందులోనూ అనర్హతల పరిశీలన పూర్తి చేసి ఈ నెల 11లోగా వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ విడతలో ఏయే అనర్హతలను పరిశీలించాలనేది కూడా ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొన్నట్లు తెలుస్దోంది. ఇందుకోసం హైకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల్ని కూడా ప్రభుత్వం బేఖాతరు చేస్తున్నట్లు అర్ధమవుతోంది.దీంతో లబ్దిదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
జగన్ సర్కార్ సంక్షేమ కోతలు
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి భారీ మెజారిటీతో అధికారం కట్టబెట్టడానికి ఉపకరించిన సాధనాల్లో సంక్షేమ అజెండానే మొదటిస్ధానంలో ఉంటుంది. నవరత్నాల పేరుతో వైసీపీ ప్రకటించిన సంక్షేమ అజెండాను, వైఎస్ కుటుంబ విశ్వసనీయతను నమ్మి ప్రజలు అధికారం ఇచ్చారు. కానీ ప్రభుత్వం రెండేళ్లు గడిచాయో లేదో సంక్షేమ పథకాల్లో కోతలు మొదలుపెట్టేసింది. ముఖ్యంగా సామాజిక పింఛన్లతో పాటు బియ్యం కార్డుల తొలగింపు, ఆరోగ్యశ్రీ కార్డుల తొలగింపు, ఇతర సంక్షేమ పథకాల్లోనూ కోతలు మొదలైపోయాయి. వీటన్నింటి అంతిమ లక్ష్యం అప్పులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రభుత్వానికి కాస్తో కూస్తో ఊరటనివ్వడమే. దీంతో అధికారులు కూడా ప్రభుత్వ ఆదేశాలతో రంగంలోకి దిగి సంక్షేమ కోతలపై దూసుకెళ్తున్నారు.
పింఛన్ల కోతల్లో మరో అంకం
నవరత్నాల పేరుతో ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా పెన్షన్లలో గతేడాది కాలం నుంచీ ప్రభుత్వం కోతలు విధిస్తూ వస్తోంది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ అనర్హుల్ని ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇలా లక్షలాది పింఛన్లలో కోతలు విధించారు. గతంలో అర్హతల్ని పట్టించుకోకుండా పెన్షన్లు ఇచ్చి ఇప్పుడు కోతలు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇంటికో పెన్షన్ మాత్రమే అనే నిబంధన తెచ్చారు. అలాగే రేషన్ కార్డుల్ని ఆధార్ కు లింక్ చేసి తద్వారా పింఛన్లు తొలగించారు. రెండు, మూడు నెలలకోసారి పింఛన్ తీసుకునే అవకాశాన్ని రద్దు చేశారు. ఏ నెల పింఛన్ ఆ నెల మాత్రమే తీసుకునేందుకు అనుమతిస్తున్నారు. అలాగే మిగతా పథకాలు, ఆస్తులు, కరెంటు బిల్లులతో లింక్ చేసి మరో విడత పింఛన్ల తొలగింపు కోసం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
రెండో విడత తనిఖీలకు ఆదేశాలు
ప్రభుత్వం లబ్దిదారులకు నెలనెలా ఇస్తున్న పింఛన్లలో ఓసారి భారీ ఎత్తున నోటీసులు జారీ చేసి కోతలు విధించిన ప్రభుత్వం.. ఇప్పుడు మరోసారి అదే స్ధాయిలో కోతలకు సిద్ధమైంది. ఈ నెల 11లోగా మరోసారి తనిఖీలు చేపట్టి అనర్హుల జాబితాలను సిద్ధం చేయాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో అధికారులు నిబంధనల మేరకు లేని పింఛన్లను పార్టీలకు అతీతంగా కట్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో కరెంటు బిల్లు ఎక్కువగా వచ్చిందనో, లేక ఆస్తిపాస్తులు ఎక్కువగా ఉన్నాయనో లేక ఇంట్లో రెండు పించన్ల నిబంధనో ఏదో ఒకటి వర్తింపచేసి పింఛన్ల తొలగింపు కోసం అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ ప్రక్రియ 11వ తేదీ వరకూ కొనసాగనుంది.
లబ్దిదారుల్లో పెరుగుతున్న ఆందోళన
ఏపీలో ఇప్పటికే ఓ విడతలో భారీ ఎత్తున పింఛన్లను తొలగించారు. ఇందులో వివిధ రకాల కారణాలతో నోటీసులు జారీ చేసి లబ్దిదారులకు పింఛన్లను దూరం చేశారు. ఇప్పుడు రెండో విడతకూ సిద్ధమయ్యారు. దీంతో లబ్దిదారుల్లో ఆందోళన అంతకంతకూ పెరుగుతోంది. ఎప్పుడు ఏ నోటీసు వస్తుందో, తమ పింఛన్ తొలగిస్తారో అన్న భయం లబ్దిదారుల్లో కనిపిస్తోంది. కొన్నేళ్లుగా వరుసగా పింఛన్లు తీసుకుంటున్న వారూ ఈ కోతల్లో బాధితులుగా మారుతుండటమే ఇందుకు కారణం. దీంతో ప్రభుత్వం తీవ్ర విమర్శల పాలవుతోంది. వైసీపీ సర్కార్లో పింఛన్లు ఇచ్చినట్లే ఇచ్చి లాక్కుంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
హైకోర్టు ఆదేశాల బేఖాతర్ ?
తాజాగా సంక్షేమ పథకాలకు సంబంధించి హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇందులో లబ్దిదారులకు సంక్షేమ పథకాలను మధ్యలో దూరం చేయడం కుదరదని స్పష్టం చేసింది. అనర్హుల పేరుతో మధ్యలో సంక్షేమ పథకాలు ఎలా తొలగిస్తారని ప్రశ్నించింది. ఓ వ్యక్తి సదరు పథకానికి అర్హుడో కాదో ముందుగానే చూసుకోవాలని, ఓసారి అర్హుడని నిర్ణయించి పథకం ఇచ్చాక మధ్యలో దాన్ని ఆపేయడం కుదరదని హైకోర్టు పేర్కొంది. కానీ ప్రభుత్వం మాత్రం ఈ ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. తాజాగా పెన్షన్ల కోతలకు ఇచ్చిన ఆదేశాలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది.
Recommended Video
ఆన్ లైన్ లో పింఛన్ల వివరాలు దాచేస్తున్న సర్కార్
గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సామాజిక పింఛన్ల పంపిణీ వివరాలు వైఎస్సార్ పింఛను కానుక వెబ్ సైట్లో అధికారికంగా ఉంచేది. అలాగే మీడియాకు కూడా నెలవారీ పింఛన్ల పంపిణీపై ప్రతీ నెల మొదటి రోజు గంటగంటకూ వివరాలు పంపేది. ఆగస్టు వరకూ సజావుగా సాగిన ఈ విధానాన్ని ఇప్పుడు మార్చేశారు. పింఛన్ల కోతలపై ఎదురవుతున్న విమర్శల్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ఎంతమందికి పించన్లు ఇస్తున్నారన్న విషయాన్ని ప్రభుత్వం రహస్యంగా ఉంచుతోంది. కేవలం అధికారులకు మాత్రమే ఈ సామాజిక పింఛన్ల వివరాలు తమ లాగిన్ ద్వారా తెలుసుకునేలా ఏర్పాటు చేశారు. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కూడా తీవ్ర విమర్శల పాలవుతోంది.