టాలీవుడ్ కు జగన్ భారీ షాక్- ఏపీలో ఇక ఏ సినిమా అయినా ఒకే రేటు-సేమ్ షోలు-ఆన్ లైన్ టికెట్లు
ఏపీ అసెంబ్లీ ఇవాళ ఆమోదించిన సినిమాటోగ్రఫీ చట్ట సవరణ బిల్లు ప్రకారం టాలీవుడ్ లో పెనుమార్పులు రాబోతున్నాయి. ముఖ్యంగా ఇన్నాళ్లూ కొత్త సినిమాల విషయంలో తాము అనుకున్నదే చేయాలని భావించిన నిర్మాతలకు చెక్ పెడుతూ ఇందులో పలు కొత్త నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో టికెట్ల అమ్మకాలు, షోలు, ఇతర అంశాల్లోనూ ప్రభుత్వ జోక్యం పెరగబోతోంది. దీంతో టాలీవుడ్ జగన్ సర్కార్ చెప్పుచేతల్లోకి వెళ్లబోతోంది.
టాలీవుడ్ కు భారీ షాక్
ఇన్నాళ్లూ టాలీవుడ్ పరిశ్రమ బాగు కోసమంటూ ఏపీలోని వైసీపీ సర్కార్ చుట్టూ చక్కర్లు కొట్టిన టాలీవుడ్ పెద్దలకు ప్రభుత్వం భారీ షాకిచ్చింది. ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలు తామే చేపడతామంటూ అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు అందులో పొందుపరిచిన నిబంధనలు చూస్తుంటే టాలీవుడ్ కు, ముఖ్యంగా కొత్త సినిమాలు, భారీ సినిమాలకు మాత్రం గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లేనని భావిస్తున్నారు. దీంతో టాలీవుడ్ ఇదంతా కోరుకుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆన్ లైన్ తో సర్కార్ చేతుల్లోకి టికెట్లు
టాలీవుడ్ కోరుకున్నట్లుగానే ఆన్ లైన్ టికెట్ల విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు ప్రభుత్వం ఇన్నాళ్లుగా చెబుతూ వచ్చింది. ఇప్పుడు అసెంబ్లీలోనూ ఆ మేరకు సినిమాటోగ్రఫీ చట్లంలో సవరణలు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించుకుంది. దీని ప్రకారం ఇకపై ప్రభుత్వమే వెబ్ సైట్ పెట్టి ఆన్ లైన్ టికెట్ల విక్రయాలు చేపట్టబోతోంది. అదే సమయంలో ధియేటర్లలోనూ అదే వెబ్ సైట్ ద్వారా టికెట్లు అమ్మే ఏర్పాటు చేస్తున్నారు. దీంతో మొత్తం మీద టికెట్ల వ్యవహారం ప్రభుత్వం చేతుల్లోకి వెళ్లిపోతోంది.
సర్కార్ చెప్పిన ధరలకే టికెట్లు
తాజా బిల్లుతో ప్రభుత్వం తాము చెప్పిన ధరలకే టికెట్లు అమ్ముకునేలా టాలీవుడ్ నిర్మాతల్ని కంట్రోల్ చేసేందుకు వీలు కలిగింది. ఇప్పటివరకూ కొత్త సినిమాలు, భారీ సినిమాల విషయంలో నిర్మాతలు తొలి రెండు రోజులు, వారం రోజులు ఇలా అదనపు రేట్లకు టికెట్లు అమ్ముకునేవారు. ఈ మేరకు గత సినిమాటోగ్రఫీ చట్టంలో వెసులుబాటు కూడా ఉండేది. కానీ ఇప్పుడు ప్రభుత్వం చేసిన మార్పులతో ఇకపై ప్రభుత్వం నిర్ణయించిన టికెట్ ధరలకే నిర్మాతలు ధియేతర్ల ద్వారా వాటిని విక్రయించాల్సి ఉంటుంది. ఎన్ని టికెట్లు అమ్మాలి, ఎప్పడు అమ్మాలి, ఎంతకు అమ్మాలనేది కూడా ప్రభుత్వమే నిర్ణయించబోతోంది.
షోల సంఖ్యా ప్రభుత్వ ఇష్టమే
ఇప్పటివరకూ టాలీవుడ్ సినిమాలకు అవి విడుదలైన కొత్తలో ఎన్ని షోలు వేయాలనేది నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లతో మాట్లాడి నిర్ణయించేవారు. ఆ మేరకు ధియేటర్లు సినిమాలు ప్రదర్శించేవి. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం చేసిన మార్పుతో ఏ సినిమా ఎన్ని షోలు పడాలన్నది ప్రభుత్వమే నిర్ణయించబోతోంది. అంతకు ముంచి షోలు వేసే అవకాశం కానీ, వాటికి టికెట్లు అమ్మే అవకాశం కానీ ఎవరి చేతుల్లో ఉండదు,. అంతకు మించి ఏం చేయాలన్నా ప్రభుత్వం దయాదాక్షిణ్యాలు తప్పనిసరి. దీంతో ఆ మేరకు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ధియేటర్లు నష్టపోక తప్పదు.
Recommended Video
పారదర్శకత సాధ్యమేనా ?
ప్రభుత్వం తాజాగా చేసిన మార్పులతో టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ వంటి కొందరు హీరోల్ని టార్గెట్ చేయడం ఖాయమనే వాదన వినిపిస్తోంది. ఇప్పటివరకూ పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు విడుదలయ్యేటప్పుడు వాటిని ఎన్నిషోలు వేయాలి, టికెట్లను ఎంతకు అమ్మాలనే విషయం సదరు నిర్మాతలు నిర్ణయించుకునేవారు. ఎక్కువ షోలు వేయాలంటే ప్రభుత్వాలను అనుమతి అడిగేవారు. ఆ అనుమతుల విషయంలోనే వివాదం చెలరేగి చివరికి ప్రభుత్వం చట్టం చేసే వరకూ వెళ్లింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం తాము అనుకున్న విధంగా ఇలాంటి సినిమాలను, నిర్మాతలని నియంత్రించే అవకాశం దక్కింది. కాబట్టి ప్రస్తుతం అందరికీ వర్తించేలా ఒకే రూల్ వర్తింపచేస్తారా లేక పవన్ వంటి వారిని టార్గెట్ చేస్తారా అన్నది త్వరలోనే తేలిపోనుంది.