స్కిల్ కేసులో జగన్ సర్కార్ కీలక నిర్ణయం ! హైకోర్టులో అఫిడవిట్..
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్నట్లు చెబుతున్న స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాం కేసులో వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఇప్పటివరకూ సీఐడీతో దర్యాప్తు చేయిస్తూ విపక్ష నేత చంద్రబాబును జైలుకు పంపిన వైసీపీ సర్కార్.. ఇప్పుడు అంతకు మించిన నిర్ణయం తీసుకుంది. తాజాగా స్కిల్ స్కాంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ హైకోర్టులో కాంగ్రెస్ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిల్ పై వైసీపీ సర్కార్ తన అభిప్రాయం చెప్పేసింది.
ఏపీ స్కిల్ స్కాంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిల్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ఏపీ ప్రభుత్వం అభిప్రాయం కోరింది. దీనిపై స్పందించిన వైసీపీ సర్కార్.. స్కిల్ స్కాంపై కేంద్ర దర్యాప్తు సంస్ధ సీబీఐతో దర్యాప్తు చేయించేందుకు అభ్యంతరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్ కూడా దాఖలు చేసింది. దీంతో ఈ వ్యవహారం ఎన్నికల ముందు కాక రేపేలా కనిపిస్తోంది.

స్కిల్ స్కాంపై దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిల్పై ఇవాళ జరిగిన విచారణ తర్వాత హైకోర్టు దీన్ని మరోసారి వాయిదా వేసింది. అయితే ఈ కేసులో పిటిషనర్ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ ఓ కీలక అంశాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చారు. ఈ కేసులో కొందరు ప్రతివాదులను నోటీసులు అందలేదని, మరికొందరు నోటిసులు తీసుకొనేందుకు ఇష్టపడటం లేదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై స్పందించిన హైకోర్టు ధర్మాసనం.. తదుపరి విచారణలో న్యూస్ పేపర్ ద్వారా ప్రతివాదులకు నోటీసులు పంపే అంశంపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అలాగే ఉండవల్లి దాఖలు చేసిన ఈ కేసులో తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది..












Click it and Unblock the Notifications