విశాఖ షిఫ్టింగ్ పై జగన్ మరో అడుగు-భవనాలు కేటాయిస్తూ జీవో జారీ..
ఏపీ కార్యనిర్వాహక రాజధాని కాబోతున్న విశాఖపట్నం నుంచి తాత్కాలిక పరిపాలన ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న వైఎస్ జగన్ .. అందుకు తగ్గట్టే అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సీఎం జగన్ పాలన, వసతి కోసం రిషికొండపై భారీ ఖర్చుతో భవనాలు నిర్మించగా.. మంత్రులు, అధికారుల కార్యాలయాలు, వసతి కోసం గుర్తించిన భవనాలను వారికి కేటాయిస్తూ ప్రభుత్వం ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో ఎవరెవరికి ఎక్కడెక్కడ అనే వివరాలను సమగ్రంగా ఇచ్చారు.

వైజాగ్ లోని రుషికొండ మిలీనియం టవర్స్ లోని ఏ, బీ బ్లాకుల్లో మొత్తం 35 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు, వసతి కోసం కేటాయింపులు చేస్తూ ఇవాళ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇందులో విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ఉత్తరాంధ్రలో అభివృద్ధి సమీక్ష కోసం ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులకు తాత్కాలిక కార్యాలయాలు, వసతి సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల అధికారుల కమిటీ సిఫార్సు మేరకు ఈ భవనాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
ఉత్తరాంధ్ర అభివృద్ధి లో భాగంగా విశాఖపట్నంలో సమీక్షలు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఈ భవనాల కేటాయింపులు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. విశాఖ పర్యటన లో మంత్రులు, అధికారుల కోసం క్యాంప్ కార్యాలయాలను ఇందులో గుర్తించి కేటాయించారు. రిషికొండ మిలినియం టవర్స్ లో మంత్రులు,అధికారుల క్యాంప్ కార్యాలయాలకు చోటు కల్పించారు.
అలాగే మిలినియం టవర్స్ లో మంత్రులు, అధికారులు, HODల క్యాంపు కార్యాలయాలు కూడా ఇందులో ఉన్నాయి. వీటిని శాఖల వారీగా ఎవరెవరికి ఎక్కడ అన్న వివరాలను ప్రభుత్వం జీవోలో పొందుపరిచింది.
అయితే ఎప్పటి నుంచి ఇక్కడ పాలన ప్రారంభం అవుతుందన్న దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. సీఎం జగన్ ఎప్పుడు వైజాగ్ కు తరలివస్తారు, ఆయన వచ్చాకే అధికారులు వస్తారా లేక ముందుగానే వస్తారా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు వైజాగ్ కు కార్యాలయాల తరలింపుపైనా హైకోర్టులో ఇప్పటికే ఓ ప్రజాప్రయోజన వాజ్యం పెండింగ్ లో ఉంది.












Click it and Unblock the Notifications