ఛార్టర్డ్ ఫ్లైట్స్ లో స్వస్ధలాలకు ఏపీ వాసులు - అనుమతివ్వాలని కేంద్రానికి జగన్ లేఖ
కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్రం వందే భారత్ మిషన్ నిర్వహిస్తోంది. విదేశాలకు ప్రత్యేక విమానాలను పంపడం ద్వారా అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను విడతల వారీగా తీసుకొస్తున్నారు. అయితే స్వస్ధలాలకు రావాల్సిన భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో ఈ విమానాలు సరిపోవడం లేదనే పిర్యాదులు పెరుగుతున్నాయి.
విదేశాల్లో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రులను వెనక్కి పిలిపించడం నానాటికీ ఆలస్యం అవుతున్న నేపథ్యంలో విమానాల సంఖ్య పెంచాలంటూ విదేశాంగ మంత్రి జై శంకర్ కు సీఎం జగన్ లేఖ రాశారు. లేదా కిర్గిస్దాన్, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సింగపూర్ నుంచి ఏపీకి ఛార్జర్ట్ విమానాలు నడుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు.
వందే భారత్ మిషన్ కింద కేంద్రం చేపడుతున్న చర్యలను ప్రశంసించిన జగన్.. అదే సమయంలో ఈ మిషన్ కింద ఏపీకి కేటాయించిన విమానాలు సరిపోవడం లేదన్నారు. విదేశాల్లో ఉన్న ప్రవాసాంధ్రులను ఏపీకి పంపేందుకు ఛార్టర్డ్ విమానాలకు అనుమతి ఇప్పించాలని అక్కడి తెలుగు సంఘాలు కోరుతున్నాయని, కేంద్రం అనుమతిస్తే వాటి ద్వారా ఏపీ వాసులను స్వస్ధలాలకు చేరుస్తామన్నారు.