వైసీపీలో మరో పవర్ సెంటర్- సజ్జల బాధ్యతల్లో కోత- అంతుబట్టని జగన్ అంతరంగం...
పదేళ్ల క్రితం వైఎస్సార్సీపీ ప్రస్ధానం ప్రారంభించిన తర్వాత ఆ పార్టీకి మూలస్తంభాలుగా ఉన్న వారెవరంటే ఓ ముగ్గురి పేర్లు తడుముకోకుండా చెప్పొచ్చు.. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధినేత జగన్ తర్వాత వారిదే హవా. ఒకరిద్దరు మంత్రులు కీలకంగా ఉన్నప్పటికీ పార్టీ బాధ్యతల్లో అంతా వీరు చెప్పినట్లే సాగుతుంటుంది. అంతర్గతంగా వీరి మధ్య కూడా ఆధిపత్య పోరు ఉన్నా పార్టీ భారాన్ని వీరే మోస్తూ వచ్చారు. అలాంటిది తాజాగా తెరవెనుక పార్టీకి అండగా ఉంటూ వస్తున్న మరో పాత్రను జగన్ ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. ఆయనే వీపీఆర్..
రమణ దీక్షితులుపై జగన్ సీరియస్- మాదిరెడ్డి తర్వాత ఆయనేనా ? తెచ్చిపెట్టుకున్న వాళ్లే...
ఎవరీ వీపీఆర్...
ఎప్పుడూ విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అనే మూడు పాత్రల మధ్య నలిగే వైసీపీ తెరపై మరో పాత్ర ఎంట్రీ ఇవ్వబోతుందంటేనే.. ఎవరై ఉంటారన్న ఆసక్తి అందరిలోనూ కలుగుతోంది. ఆ నాలుగో పాత్ర మరెవరో కాదు వీపీఆర్. పారిశ్రామికవేత్తగా, రాజ్యసభ ఎంపీగా నెల్లూరు జిల్లాకే పరిమితమైన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వీపీఆర్ పేరుతో ప్రసిద్ధులు. వైసీపీ ప్రస్ధానం ప్రారంభమైన నాటి నుంచి పార్టీకి ఆర్ధికంగా అండగా ఉన్నా వీపీఆర్.. తెరముందు కనిపించేది చాలా తక్కువ. విజయసాయిరెడ్డి తర్వాత జగన్ ముందు రాజ్యసభ ఎంపీ ఛాయిస్ గా నిలిచిన వీపీఆర్ కష్టకాలంలో పార్టీని అన్నివిధాలా ఆదుకున్నారు. పార్టీ రాజకీయాలే కాదు అర్ధికంగా అండగా నిలవడమే కాదు.. ఓ కీలక జోన్ లో వైసీపీకి పెద్దన్నగా వ్యవహరించారు. అందుకే ఆయన ఆ ముగ్గురి సరసన నిలబడటమే కాదు జగన్ కు ప్రీతిపాత్రుడయ్యారు.
కీలకమైన ప్రకాశం, కర్నూలు జిల్లాలు..
గ్రేటర్ రాయలసీమగా చెప్పుకునే ప్రాంతంలో పక్కపక్కనే ఉండే ప్రకాశం, కర్నూలు జిల్లాలు చాలా కీలకం. ఈ రెండు జిల్లాల్లో గతంలో ఉన్న పరిస్ధితులు వేరు. ఇప్పుడు వేరు. ఈ రెండు జిల్లాలు వాస్తవానికి వైసీపీకి బలమైన జిల్లాలు. అయితే పార్టీ అంతర్గత రాజకీయాల వల్ల గతంలో ఇక్కడ ఎదురుదెబ్బలు తప్పలేదు. గతేడాది వైసీపీ గాలి రాష్ట్రమంతా బలంగా వీచినా పార్టీకి పరిస్ధితులు అనుకూలంగా ఉన్న ప్రకాశం జిల్లాలో కొన్ని ఎదురుదెబ్బలు తప్పలేదు. దీంతో గతంలో మరో నేత వైవీ సుబ్బారెడ్డి చూసిన ప్రకాశం జిల్లా బాధ్యతలతో పాటు కర్నూలు జిల్లాను కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి అఫ్పగించారు.
సజ్జల బాధ్యతల్లో కోత ఎందుకు ?
ప్రస్తుతం కర్నూలు, ప్రకాశం జిల్లాల వైసీపీ బాధ్యతలు పార్టీలో కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఓ దశలో జగన్ స్ధానంలో పార్టీ బాధ్యతలు ఆయనే చూసుకుంటారనే ప్రచారం జరిగింది. సీఎం అయ్యాక జగన్ బిజీ కావడంతో ఏడాది తర్వాత ఆయన స్ధానంలో పార్టీ బాధ్యతలు నమ్మకస్తుడైన సజ్జలకు అప్పగిస్తారనే వాదన మొదలైంది. అదే సమయంలో జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. పార్టీ బాధ్యతలను ముందునుంచీ వైసీపీకి అండగా నిలిచిన ముగ్గురు నేతలకు పంచారు. ఇందులో కర్నూలు, ప్రకాశం బాధ్యతలు కూడా సజ్జలకు దక్కాయి. అయితే మరోసారి ఆయన బాధ్యతల్లో కోత పెట్టి వేమిరెడ్డిని తెరపైకి తీసుకురావడంపై చర్చ జరుగుతుతోంది. అదీ గతంలో మరో నేత వైవీ సుబ్బారెడ్డి చూసిన ప్రకాశం జిల్లా బాధ్యతలు కూడా ఉండటం మరో ట్విస్ట్..
Recommended Video
ఆధిపత్య పోరే కారణమా ?
ఇప్పటికే పార్టీ బాధ్యతలు మోస్తున్న ముగ్గురు కీలక నేతలు విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మధ్య ఆధిపత్య పోరు సాగుతోందనే ప్రచారం ఉంది. ఎస్వీబీసీ ఛానల్ ఛైర్మన్ గా ఉన్న బాలిరెడ్డి పృధ్వీరాజ్ ఉద్వాసనకు దారి తీసిన పరిస్ధితుల వెనుక కూడా ఇదే కారణమనే చర్చ సాగింది. తాజాగా టీటీడీలో పాలనపై రమణదీక్షితులు ఆరోపణల వెనుక కూడా ఇదే ఆధిపత్య పోరు కారణమని తెలుస్తోంది. విశాఖ వ్యవహారాల్లో కీలకంగా ఉన్న సాయిరెడ్డి వ్యతిరేకంగా తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల వెనుక కూడా ఇలాంటి రాజకీయాలే వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో జగన్ అనూహ్యంగా వేమిరెడ్డిన తెరపైకి తీసుకురావడం వెనుక కారణాలు అంతుబట్టడం లేదు. పార్టీ, ప్రభుత్వ బాధ్యతల్లో సజ్జల బిజీగా ఉండటం వల్లే వేమిరెడ్డిని తీసుకొస్తున్నట్లు మరో ప్రచారం ఉంది.