పతనం మొదలైంది .. టైం దగ్గర పడింది .. దిశా చట్టం పెట్టాలి : వైఎస్ జగన్ పై టీడీపీ నేతల ఆగ్రహం
ఏపీ రాజధాని అమరావతినే అంటూ ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. వైజాగ్ వద్దు అమరావతి ముద్దు అంటున్న రాజధాని గ్రామాల రైతులు 24 వ రోజు కొనసాగుతుంది. ఇక టీడీపీ నేతల ర్యాలీలను, రాజధాని రైతుల పాదయాత్రలను అడుగడుగునా అడ్డుకుంటున్న పోలీసులు ఈ రోజు మహిళలు అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా దాడి చేశారని రాజధాని రైతులు మండిపడుతున్నారు. నేడు బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరకు పాదయాత్రగా వెళ్లి నైవేద్యాలు పెట్టాలని భావించిన రాజధాని మహిళలను పోలీసులు అడ్డుకున్నారు. వారిపై విచక్షణా రహితంగా దాడికి దిగారు. దీంతో మహిళలు కన్నీటి పర్యంతం అయ్యారు. వైసీపీ ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్న కేశినేని నానీ
ఇక తాజా పరిస్థితులపై స్పందించిన ఎంపీ కేశినేని నానీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారంటూ మండిపడ్డారు. టీడీపీ నేతలు రాజధాని రైతుల పోరాటాలకు మద్దతు తెలపకుండా పోలీసులు గృహ నిర్బంధాలకు పాల్పడుతున్నారని , ఇక సీఎం జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశాంతంగా తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్న మహిళలు, ప్రజాప్రతినిధులు, జేఏసీ ప్రజా సంఘాల నేతలను అరెస్ట్ చేస్తూ రాష్ట్రంలో మిలిటరీ పాలన చేస్తున్నారని విమర్శలు గుప్పించారు కేశినేని నానీ .

నీ పతనం మొదలైంది అంటూ హెచ్చరిక
ఇలా నియంతృత్వ పోకడలు మంచివి కాదని చెప్పిన కేశినేని నానీ జగన్ లాగా ఎందరో నియంతృత్వ ధోరణి కలిగిన వారు మట్టిలో కలిసిపోయారని, నీ పతనం మొదలైంది జగన్మోహన్ రెడ్డిగారూ అంటూ వ్యాఖ్యానించారు.శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్న నిరసనకారులపై పోలీసుల అండతో ప్రభుత్వం అకృత్యాలకు పాల్పడుతోందని కేశినేని నానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని కోసం పోరాడుతున్న రైతుల నుంచి చిందుతున్న రక్తంతో అమరావతి ప్రాంతం ఎర్రగా మారిందని ఆయన పేర్కొన్నారు.

జగన్ కు టైం దగ్గర పడిందన్న బుద్దా .. హక్కులు కాలరాస్తున్నారన్న గల్లా
ఇక సీఎం జగన్ రాజధాని విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్న బుద్ధా వెంకన్న సీఎం జగన్ కు టైం దగ్గర పడిందన్నారు. రాజధాని రైతులను ఇంత వేదనకు గురి చేస్తున్న జగన్ ను జైలు గోడలు రావాలి జగన్ కావాలి జగన్ అంటున్నాయని పేర్కొన్నారు. రాజధానిలో మహిళా రైతులపై వైసీపీ సర్కార్ చేయిస్తున్న దాడులు అమానుషం అని ఆయన పేర్కొన్నారు. ఇక అమరావతి ప్రాంతంలో మహిళలపై పోలీసుల లాఠీచార్జిని టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ఖండించారు . రైతులు, మహిళలు చేపట్టిన శాంతియుత నిరసనలను పోలీసులు లాఠీలతో అడ్డుకోవడం హేయమైన చర్య అని విమర్శించారు.రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు, స్వేచ్ఛను వీరు మరచిపోయినట్టున్నారు అని ఎంపీ గల్లా జయదేవ్ మండిపడ్డారు.

జగన్ పై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలన్న అనిత
మహిళలపై దాడులు చేయిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని టీడీపీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే అనిత డిమాండ్ చేశారు. జగన్ పాలనలో అమరావతి ప్రాంత మహిళలపై దాడులు జరుగుతున్నాయని , వారి శరీరాలు రక్తమోడుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత మంది మహిళలను బాధిస్తున్న జగన్ పై దిశ చట్టాన్ని అమలు చేయాలని అన్నారు. మహిళా కమీషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్.. ఒక్క ఆడడానికి భయపడుతున్నారని ఎద్దేవా
వైసీపీ పాలనలో మహిళలను కంటతడి పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతంలో మగాళ్లు లేరా? ఆడవాళ్లు వచ్చి ధర్నాల్లో పాల్గొంటున్నారని వైసీపీ నాయకురాలు ఒకరు అసభ్యకరంగా మాట్లాడారని మండిపడిన ఆమె ఒక ఆడది అయ్యుండి ఇలా మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. రాజధాని ప్రాంత మహిళలు మెడల్లో బంగారు గొలుసు ఉన్నాయని మాట్లాడారని వారికి బంగారం ఉండకూడదా అని ఆమె ప్రశ్నించారు. జగన్.. ఒక్క ఆడడానికి భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ రోజు కోర్టుకు వెళ్ళిన విషయం ప్రస్తావనకు రాకుండా జగన్ మహిళలపై దాడి చేయించారని ఆమె ఆరోపించారు.

అమరావతికి రావాలని వైసీపీ మంత్రులకు సవాల్
అమరావతి ఉద్యమం కాదు, ఆవకాయబద్దా కాదని అన్నారని... ఒకసారి అమరావతికి రావయ్యా అని ఆయనకు చెబుతున్నానని అనిత సవాల్ విసిరారు. మా మహిళలు నీకు ఆవగాయ పెడతారో, ఇంకేం పెడతారో తెలుస్తుందని ఆమె ఘాటుగా విమర్శించారు. సోషల్ మీడియాలో అమరావతి ప్రాంత మహిళల గురించి నీచంగా రాస్తున్నారని అనిత మండిపడ్డారు. రాజధాని మహిళలకు సమాధానం చెప్పకుండా జగన్ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత .












Click it and Unblock the Notifications