ఎగ్జిట్ పోల్స్ తో మారిన జగన్ షెడ్యూల్ .. రేపు తాడేపల్లిలో అత్యంత ముఖ్య నాయకులతో సమావేశం .. అందుకే
ఆదివారం నాటి ఎగ్జిట్ పోల్స్తో వైసీపీ చీఫ్ జగన్ తన షెడ్యూల్ను మార్చుకున్నారు. ఈ రోజు జగన్ పార్టీ నేతలతో సమావేశం కావాల్సి ఉండగా దానిని రద్దు చేసుకున్నారు. రేపు తాడేపల్లి చేరుకోనున్న జగన్ ముఖ్య నాయకులతో తాజా పరిణామాలపై చర్చించనున్నారు.అంతే కాదు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైన , అలాగే వైసీపీకి పెరిగిందని చెప్తున్న పోలింగ్ శాతంపైన లోతైన విశ్లేషణలు చేస్తుంది వైసీపీ . ఈ దఫా ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ అంతే ప్రతిష్టాత్మకంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను తీసుకుని విశ్లేషిస్తుంది.
మారిన షెడ్యూలు ప్రకారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం నుంచి సార్వత్రిక ఎన్నికల ఫలితాల సరళిని జగన్ సమీక్షిస్తారు. ఇందుకోసం రేపు సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు జగన్. అత్యంత ముఖ్యమైన నేతలతో సమావేశం అవుతారు. తాజా రాజకీయ పరిస్థితులు, జాతీయ, స్థానిక ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై విశ్లేషిస్తారు. అయితే ముఖ్యంగా జాతీయ సర్వేసంస్థలు వెల్లడించిన ఫలితాల్లో వైసీపీకి పెరిగిన పోలింగ్ శాతంపై ప్రధానంగా వైసీపీ నేతల్లో చర్చ జరుగుతుంది. జాతీయ చానళ్లు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్లో టీడీపీ-వైసీపీ మధ్య ఓట్ల శాతం చాలా ఎక్కువగా ఉండడం వైసీపీ నేతల్లో చర్చకు కారణమైంది.
ఈసారి పోల్మేనేజ్మెంట్లో చంద్రబాబు వెనకబడ్డారని భావిస్తున్న వైసీపీ నేతలు జాతీయ చానళ్లు చెబుతున్నట్టు ఇరు పార్టీల మధ్య ఓట్ల శాతంలో అంత తేడా ఉండే అవకాశం లేదంటున్నారు. జాతీయ చానళ్లు చెబుతున్నట్టు 5 నుంచి 10 శాతం ఓట్ల తేడా అంటే ఫలితాలు ఏకపక్షంగా ఉంటాయని భావిస్తున్నారు. కానీ బూత్ స్థాయిలో అలాంటి పరిస్థితి కనిపించడం లేదని అంటున్నారు. ఏది ఏమైనా ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైనే కాకుండా, తాజా రాజకీయ పరిణామాలపైన, ఎగ్జిట్ పోల్స్ విశ్వసనీయత మీద అత్యంత ముఖ్య నాయకులతో జగన్ భేటీ కానున్నారు.