ఏపీలో కొత్త సీఈసీ రేసులో ఆ ముగ్గురు- గవర్నర్కు ప్రతిపాదన- అందరూ విధేయులే
ఏపీలో ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో కొత్త ఎస్ఈసీ నియామకం కోసం ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఇందుకోసం ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న ముగ్గురు అధికారుల పేర్లను కొత్త ఎస్ఈసీగా పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్ హరిచందన్ను ప్రభుత్వం కోరింది. వీరిలో ఒకరిని ఆయన త్వరలో ఎంపిక చేయనున్నారు. వీరంతా మాజీ ఐఏఎస్లు కావడం, ఇందులో ఇద్దరు ప్రస్తుతం సీఎం జగన్కు సలహాదారులుగా ఉండటం, మరో అధికారి కూడా వైఎస్ కుటుంబానికి విధేయుడే కావడంతో ఈ జాబితా ప్రాధాన్యం సంతరించుకుంది.

కొత్త ఎస్ఈసీకి కసరత్తు మొదలు
ఏపీలో ఈ నెల 31తో ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కొత్త ఎస్ఈసీ ఎవరన్నది ఆసక్తి రేపుతోంది. వాస్తవానికి రాజ్యంగ పదవి అయిన ఎన్నికల కమిషనర్ పోస్టులో ప్రభుత్వానికి విధేయులుగా ఉన్న వారినే నియమిస్తుంటారు. అయితే అప్పుడప్పుడూ ఓ ప్రభుత్వం నియమించిన ఎస్ఈసీ మరో ప్రభుత్వ హయాంలో పనిచేయాల్సి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో నిమ్మగడ్డ ఉదంతమే తెలియజేసింది. దీంతో ఈసారి ఎస్ఈసీ ఎంపిక కోసం జగన్ సర్కారు ఎంచుకున్న ఆప్షన్లు ఆసక్తికరంగా ఉన్నాయి.

కొత్త ఎస్ఈసీ రేసులో ముగ్గురు వీరే
ఏపీలో కొత్త ఎస్ఈసీ రేసులో ఉన్న ముగ్గురు పేర్లను ఇవాళ ప్రభుత్వం గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్కు పంపింది. దీంతో ఈ ముగ్గురి పేర్లపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ జాబితాలో తాజా మాజీ సీఎస్ నీలం సాహ్నీతో పాటు ప్రస్తుత జగన్ సలహాదారుల్లో ఒకరైన శామ్యూల్, మాజీ ఐఏఎస్ ప్రేమచంద్రారెడ్డి ఉన్నారు. సీనియార్టీ పరంగా చూస్తే ప్రేమచంద్రారెడ్డి, శామ్యూల్, నీలం సాహ్నీ రేసులో ఉంటారు. ఈ ముగ్గురి పేర్లలో ఒకరిని గవర్నర్ తదుపరి ఎస్ఈసీగా నియమించే అవకాశం ఉంది. వారం రోజుల్లో నిమ్మగడ్డ రిటైర్ కానున్న నేపథ్యంలో రెండు, మూడు రోజుల్లో వీరిపై నివేదికలు తెప్పించుకుని గవర్నర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

అంతా వైఎస్ ఫ్యామిలీ వీర విధేయులే
ప్రస్తుతం ప్రభుత్వం ఎస్ఈసీ పోస్టు కోసం గవర్నర్కు పంపిన ముగ్గురూ వైఎస్ జగన్కు విధేయులే. ప్రేమచంద్రారెడ్డి ఏపీ విభజన తర్వాత తెలంగాణ క్యాడర్కు వెళ్లి అక్కడ రిటైర్ అయిన అధికారి కాగా.. శామ్యూల్ గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ చేశారు. అనంతరం ఆయన్ను వైఎస్ జగన్ సలహాదారుగా నియమించారు. ఆ తర్వాత ఢిల్లీ నుంచి ఏరికోరి తెచ్చుకున్న మాజీ సీఎస్ నీలం సాహ్నీ కూడా ప్రస్తుతం సీఎం సలహాదారుల జాబితాలోనే ఉన్నారు. ఆమెకు ప్రభుత్వం తాజాగా క్యాబినెట్ ర్యాంకు కూడా కల్పించింది. దీంతో ఈ ముగ్గురూ ప్రభుత్వానికీ, వైఎస్ కుటుంబానికీ విధేయులుగానే చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications