అభివృద్ది పుత్రుడు చంద్రబాబు;అవినీతి పుత్రుడు జగన్;మోడీ దత్త పుత్రుడు పవన్:మంత్రి లోకేష్
కర్నూలు:ప్రత్యర్థి పార్టీ అధినేతలపై మంత్రి నారా లోకేష్ విమర్శల దాడి పెంచారు. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అభివృద్ది పుత్రుడు చంద్రబాబు అయితే అవినీతి పుత్రుడు జగన్ అని...ప్రధాని మోడీ దత్తత పుత్రుడు పవన్ కళ్యాణ్ అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ గూడూరు మండలం నాగలాపురం పొలాల్లో పంట కుంటలను పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీలతో మంత్రి లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏడాదిలో రెండున్నర లక్షల పంట కుంటలు తవ్వి చరిత్ర సృష్టించామన్నారు. ఉపాధి పని దినాలు మరో యాభై రోజులు పెంచాలని, వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా పర్యటనలో నారా లోకేష్ ప్రసంగాల్లో దూకుడు టిడిపి చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది. సోమవారం పర్యటన సందర్భంగా నారా లోకేష్ కర్నూలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్రెడ్డి.. ఎంపీగా బుట్టా రేణుకల్ని భారీ మెజార్టీతో గెలిపించాలంటూ లోకేష్ ప్రజల్ని కోరారు.
మంత్రి లోకేష్ వ్యాఖ్యలతో అదే వేదికపైనే ఉన్న టీజీ వెంకటేష్ ఒక్కసారిగా అవాక్కయ్యారట. ఎందుకంటే 2014 ఎన్నికల్లో వెంకటేష్ ఎస్వీ మోహన్రెడ్డిపై పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత ఎస్వీ టీడీపీ గూటికి చేరారు. తర్వాత టీజీకి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వచ్చింది. దీంతో అతడి కుమారుడు భరత్ నియోజకవర్గంలో బాగా యాక్టివ్ అయ్యారు. ఆయన కూడా కర్నూలు అసెంబ్లీ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఈ టిక్కెట్ వ్యవహారంపై ఎమ్మెల్యే ఎస్వీ-భరత్ మధ్య మాటల యుద్ధం కూడా నడిచింది. తర్వాత అధిష్టానం పిలిచి సమన్వయంతో పనిచేయాలని చెప్పడంతో కాస్త సైలంట్ అయ్యారు. మళ్లీ ఇప్పుడు లోకేష్ వ్యాఖ్యలతో టీజీ వర్గానికి పెద్ద షాకే తగిలింది.
ఇటు ఎంపీ బుట్టా రేణుక కూడా 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచారు. ఆ తరువాత ఆమె టిడిపిలో చేరారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఆమె అసెంబ్లీకి పోటీ చేయాలనే ఆసక్తితో ఉన్నారనే ప్రచారం కొంతకాలంగా జోరుగా సాగుతోంది. అయితే తనకు అలాంటి ఉద్దేశమేమీ లేదని ఆమె క్లారిటీ ఇచ్చారు. అయితే ఎన్నికలకు మరో ఏడాది వరకు సమయం ఉన్నా...లోకేష్ ముందుగానే ఈ ఇద్దర్ని గెలిపించాలని వ్యాఖ్యానించడం అటు కర్నూలు జిల్లాలోనే కాదు మాత్రమే కాదు...ఇటు టిడిపి పార్టీలో కూడా చర్చనీయాంశంగా మారిందని తెలిసింది.












Click it and Unblock the Notifications