విద్యుత్ ఒప్పందాలపై విచారణకే మొగ్గు చూపుతున్న జగన్ .. టీడీపీకి షాక్ .. కేంద్రానికి ఝలక్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో తన మార్క్ పాలన కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. సీతయ్య ఎవరి మాట వినడు అన్న చందంగా తొలి అడుగు వేశాడు. జగన్ సీఎం అయిన తర్వాత చంద్రబాబునాయుడు హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై జగన్ పునః సమీక్ష చేస్తామని, అవసరమైతే వాటిని మార్చేస్తామని ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయమే తప్పని కేంద్రం చాలా సున్నితంగా అక్షింతలు వేసింది. జగన్ కు అర్ధం అయ్యేలా చెప్పాలని సీఎస్ కు లేఖ రాసింది. అయినప్పటికే జగన్ విద్యుత్ ఒప్పందాల పునః సమీక్ష వైపే మొగ్గు చూపారు. అందులో భాగంగా ఆయన క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
కేంద్రం ఆదేశాలు బేఖాతరు .. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జగన్ కీలక నిర్ణయం
జగన్ తీసుకున్న నిర్ణయంపై పీపీఏలను పునఃసమీక్షించడం వల్ల పెట్టుబడిదారుల్లో అపనమ్మకం ఏర్పడుతుందని కేంద్ర శక్తి వనరుల శాఖ జగన్ కు లేఖ రాసి హెచ్చరించింది . దీంతో భవిష్యత్ లో పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు వెనకాడతారని పేర్కొన్నారు ఆ శాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ . దీని వల్ల భవిష్యత్తులో కంపెనీలు దేశంలోనూ, అలాగే రాష్ట్రంలోనూ పునరుత్పాదక ఇంధన రంగాల్లో పెట్టుబడులు పెట్టడానికి సంశయిస్తాయని ఆ లేఖలో పేర్కొన్నారు . అయినప్పటికే కేంద్రం చెప్పిన విషయాలను పక్కనపెట్టిన సీఎం జగన్ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తూ రెనివెబుల్ ఎనర్జీ డెవలపర్స్ తో గత టీడీపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై (పిపిఎలపై) విచారణకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
కేంద్రం సుదీర్ఘ లేఖ రాసినా పిపిఎలపై విచారణకు కమిటీ వేసిన జగన్
రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలు ఏవైనా సెంట్రల్ రెగ్యులేటరీ కమిషన్ నిబంధనల మేరకే జరుగుతాయని చెప్పినా , ఇక చేసుకున్న ఒప్పందాల్లో ఏదైనా అవినీతి జరగడం, మితిమీరిన లబ్ధి జరిగిందన్న విషయాలు రుజువైతే తప్ప వాటిని పునః పరిశీలన చేయడానికి అవకాశం లేదని పేర్కొన్నా జగన్ మాత్రం విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలపై చాలా గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం తర్వాత చేసిన తొలి ప్రసంగంలో బహిరంగంగానే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తక్కువ ధరలకు బహిరంగ మార్కెట్లో విద్యుత్తు లభ్యమవుతున్న స్థితిలో ఎక్కువ ధర పెట్టి పిపిఎలు చేసుకోవడం ఏమిటని ఆయన ప్రశ్నించారు .
అటు టీడీపీ కి, ఇటు కేంద్రానికి షాక్ ఇస్తూ సీఎం జగన్ నిర్ణయం
ఇక ఈ నేపధ్యంలోనే ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల కేంద్రం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ఏది ఏమైనా జగన్ అవినీతి లేని, పారదర్శక పాలన అందించాలని తాపత్రయపడుతున్న నేపధ్యంలో తీసుకుంటున్న నిర్ణయాలు అన్నీ సంచలనంగా మారుతున్నాయి.కేంద్ర శక్తి వనరుల శాఖ కార్యదర్శి ఆనంద్ కుమార్ ఆ ఒప్పందాలను మార్చడానికి వీలు లేదని స్పష్టం చేస్తూ జగన్ ప్రభుత్వానికి సుదీర్ఘమైన లేఖ రాసినా, జగన్ మాత్రం విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను పునః సమీక్షించాలని నిర్ణయం తీసుకోవటం అటు టీడీపీకి, ఇటు కేంద్ర సర్కార్ కు షాక్ ఇచ్చినట్లు అయ్యింది.