జగన్ ఏకగ్రీవ ఎన్నిక..ఇలా జరిగింది : ఇక ప్రమాణ స్వీకారమే మిగిలింది: నాడు తండ్రి..నేడు తనయుడ
వైసీపీ శాసనసభా పక్షనేతగా జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో సరిగ్గా ఉదయం 10.31 గంటలకు జగన్ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నట్లుగా సమావేశంలో ప్రకటించారు. దీంతో..ఏపీకి నూతన ముఖ్యమంత్రిగా లాంఛనగా ప్రమాణ స్వీకారం చేయటమే మిగిలి ఉంది. ఈ నెల 30వ తేదీన జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం గవర్నర్ను కలిసి జగన్ను ఎన్నుకుంటూ చేసిన ఏకగ్రీవ తీర్మానం కాపీని అందించి..ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు..
వైసీపీఎల్పీ నేతగా జగన్..
ఏపీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జగన్ను తమ శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ నుండి గెలుపొందిన 151 మంది ఎమ్మెల్యేలు సమావేశంలో పాల్గొని చప్పట్లు చరుస్తూ జగన్ను అభినందించారు. సమావేశంలో తొలుత సీనియర్ నేత బొత్సా సత్యానారాయణ ..ధర్మాన ప్రసాదరావు జగన్ పేరు ప్రతిపాదించగానే ఆదిమూలపు సురేష్ బలపరిచారు. ఎమ్మెల్యేలు అంతా ఒక్కసారిగా హర్షం వ్యక్తం చేస్తూ మద్దతు ప్రకటించారు. ఆ సమయంలో జగన్ ఒక రరమైన భావోద్వేగానికి గురయ్యారు. ఆ వెంటనే ఎమ్మెల్యేలందరికీ జగన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ తీర్మాన కాపీని జగన్తో సహా వైసీపీ నేతలు మధ్నాహ్నం హైదరాబాద్ వెళ్లి గవర్నర్ నరసింహన్కు అందిస్తారు. తమ నేతను ప్రభుత్వం ఏర్పాటు చేయటానికి ఆహ్వానించాలని కోరనున్నారు. ఈ నెల 30న జగన్ లాంఛనంగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయటమే అధికారికంగా మిగిలి ఉంది.

నాడు వైయస్..నేడు జగన్..
2004లో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ నుండి పలువురు పేర్లు ముఖ్యమంత్రిగా తెర మీదకు వచ్చాయి. అయితే తన పాదయాత్ర ద్వారానే పార్టీని అధికారంలోకి తెచ్చారనే నమ్మకంతో కాంగ్రెస్ అధినాయకత్వం వైయస్కే అవకాశం ఇచ్చింది. ఇక , 2009 ఎన్నికల్లో ఎవరితో పొత్తు వద్దని..గెలిపించే బాధ్యత తనది అనే సాహసోపేత హామీతో నాడు వైయస్ కాంగ్రెస్ అధినేత్రిని ఒప్పించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 156 సీట్లతో గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు. ఇక, ఇప్పుడు జగన్ ఉమ్మడి రాష్ట్రంలో 294 సీట్లు ఉన్న సమయంలో 148 మేజిక్ ఫిగర్. ఇక, 13 జిల్లాల ఏపీలో 88 మేజిక్ ఫిగర్. అయితే, ఇప్పుడు వైసీపీ ఉమ్మడి రాష్ట్రంలో అవసరమైన మేజిక్ ఫిగర్ కంటే ఎక్కువగా సీట్లు సాధించింది. 2009లో వైయస్ ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికైతే..ఇప్పుడు ఆయన తనయుడు సరిగ్గా పదేళ్లకు తండ్రి తరహాలో ఒంటరి పోరాటం చేసి ముఖ్యమంత్రి అవుతున్నారు.












Click it and Unblock the Notifications