జగన్ లేఖపై జస్టిస్ ఎన్వీరమణను సీజే వివరణ కోరారా ? సుప్రీం క్లారిటీ- కాబోయే సీజేకు ఊరట
ఏపీ హైకోర్టులో కొందరు న్యాయమూర్తులతో కలిసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తన ప్రభుత్వాన్ని అస్ధిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఛీఫ్ జస్టిస్కు సీఎం జగన్ రాసిన లేఖపై రచ్చ కొనసాగుతూనే ఉంది. జగన్ లేఖపై స్పందించి ఛీఫ్ జస్టిస్ ఇరు తెలుగు రాష్ట్రాల ఛీఫ్ జస్టిస్లను బదిలీ చేశారని ఓవైపు, సుప్రీంకోర్టు జడ్డి ఎన్వీ రమణను వివరణ కోరారని మరోవైపు కథనాలు సాగుతున్నాయి. దీనిపై స్వయంగా సుప్రీంకోర్టే జోక్యం చేసుకుని తాజాగా స్పష్టత ఇచ్చింది. ఈ వివరణ తర్వాత అయినా సదరు కథనాలకు అడ్డుకట్ట పడుతుందో లేదో చూడాల్సి ఉంది.
Recommended Video

సీజేకు జగన్ లేఖపై దుమారం
సుప్రీంకోర్టు జడ్డి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు ఏపీ హైకోర్టులోని మరికొందరు న్యాయమూర్తులపై సుప్రీం ఛీఫ్ జస్టిస్కు సీఎం జగన్ రాసిన లేఖ దుమారం రేపుతూనే ఉంది. ఈ లేఖపై సుప్రీంకోర్టు చురుగ్గా స్పందిస్తోందని, చర్యలు తీసుకుంటోందని మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి. ముఖ్యంగా ఏపీ, తెలంగాణ హైకోర్టు బదిలీల వెనుక జగనే ఉన్నారనే ప్రచారం కేవలం మీడియాకే పరిమితం కాలేదు. తాజాగా ఏపీ హైకోర్టు నుంచి పదవీ విరమణ పొందిన జడ్జి రాకేష్కుమార్ కూడా తన చివరి తీర్పులోనూ ప్రస్తావించారు. దీంతో ఈ వాదన నిజమేనా అన్న ప్రచారం సాగింది. మరోవైపు సుప్రీం ఛీఫ్ జస్టిస్ బాబ్డే ఈ వ్యవహారంలో తన తర్వాత స్ధానంలో ఉన్న జస్టిస్ రమణ వివరణ కోరారన్న వార్తలు కూడా వచ్చాయి. దీంతో ఈ ఏడాది ఏప్రిల్లో ఛీఫ్ జస్టిస్ కానున్న జస్టిస్ రమణపైనా ఉత్కంఠ నెలకొంది.

మీడియా కథనాలపై సుప్రీం అసంతృప్తి
జగన్ లేఖపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎన్వీ రమణ వివరణ కోరారంటూ వచ్చిన వార్తలపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సదరు వార్తల్లో నేరుగా సుప్రీంకోర్టునే ప్రస్తావిస్తూ కథనాలు సాగడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో అంతర్గతంగా సాగే ఈ ప్రక్రియను మీడియా ఎలా రిపోర్టింగ్ చేస్తోందన్న అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టతలో దాదాపుగా ప్రశ్నించింది. దీంతో ఇప్పుడు ఈ స్పష్టత సైతం చర్చనీయాంశంగా మారింది. సుప్రీంకోర్టును కోట్ చేస్తూ సాగుతున్న రిపోర్టింగ్ కథనాల వాస్తవికతను సైతం ప్రశ్నార్ధకంగా మార్చేసింది. ఇప్పుడు న్యాయవర్గాల్లో సైతం ఇదే చర్చ సాగుతోంది.

సుప్రీంకోర్టు క్లారిటీ ఇదే
సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ తన పరిధిలో ఉన్న ఓ న్యాయమూర్తిని వివరణ కోరారా లేక కోరలేదా అన్న అంశాన్ని మీడియా రిపోర్టింగ్ చేయాలంటే తిరిగి వారిలో ఒకరు దాన్ని బహిర్గతం చేయాలి లేదా సుప్రీంకోర్టే ఏదో ఒక రూపంలో దాన్ని వెల్లడించాలి. కానీ ఇక్కడ ఆ రెండింటిలో ఏదీ జరగలేదు. కానీ సీజే జగన్ లేఖపై జస్టిస్ రమణ వివరణ కోరారంటూ జాతీయ మీడియా వార్తలు ప్రచురణ, ప్రసారం చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు దీనిపై స్పష్టత ఇచ్చింది. సుప్రీంకోర్టు అంతర్గత వ్యవహారాలన్నీ అత్యంత గోప్యంగా ఉంటాయని, అవి ఎట్టి పరిస్దితుల్లోనూ బహిర్గతం కాబోవంటూ సుప్రీంకోర్టు తెలిపింది. తమ కథనాలకు విశ్వసనీయతను ఆపాదించుకోవడానికి సుప్రీంకోర్టును కోట్ చేశారంటూ ఈ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టులో జరిగేదంతా రహస్యంగానే ఉంటుందని, దాన్ని మీడియా వెల్లడించడం ఎట్టిపరిస్దితుల్లోనూ జరగదని తెలిపింది.

సుప్రీం స్పందనతో రమణకు భారీ ఊరట
సీఎం జగన్ తనపై ఫిర్యాదు చేస్తూ ఛీఫ్ జస్టిస్కు రాసిన లేఖఫై మీడియాలో రోజుకో కథనం వస్తుండటం ఈ ఏప్రిల్లో ఛీఫ్ జస్టిస్ కాబోతున్న జస్టిస్ ఎన్వీ రమణకు ఇబ్బందికరంగా మారింది. దేశంలోనే అత్యంత నిబద్ధత, విశ్వసనీయత కలిగిన రాజ్యాంగ పదవి అయిన ఛీఫ్ జస్టిస్ పదవిలోకి నియామకం అయ్యే వ్యక్తికి మీడియాలో జరుగుతున్న ప్రచారంతో కొత్త సమస్యలు తలెత్తడం ఖాయం. అందుకే ఇప్పుడు సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని ఇచ్చిన వివరణతో ఈ కథనాలకు బ్రేక్ పడే అవకాశముంది. తద్వారా రమణకు కూడా ఆ మేరకు ఊరట లభిస్తుందని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications