ఆయన అడుగు ఓ అజరామరం! ప్రజాక్షేత్రంలో పాదయాత్ర ఓ అప్రతిహతం..! సాహో జగన్..!!
Recommended Video
హైదరాబాద్/ ఏపీ : ఇడుపుల పాయలో మొదలైన ఆ అడుగు అప్రతిహతంగా కొనసాగుతోంది. అశేష జనవాహిని మద్య పుట్టిన ఆ నడక ప్రజా క్షేత్రంలో అజరామరం కాబోతోంది. ఎముకలు కొరికే చలైనా, తల బొప్పికట్టే ఎండైనా, కకావికలం చేసే తుపాను ఐనా ఆ నడకముందు బలాదూర్ కాక తప్పలేదు. మడమతిప్పని పట్టుదల ముందు ప్రక్రుతి కూడా సాహో అనేసింది. అడుగులో అడుగు వేసుకుంటూ ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ఆయన ఓ బాహుబలి బాటసారిగా కొనసాగుతున్నారు. చిన్నా పెద్దన్నా అవ్వా తాతా అక్కా అమ్మా అన్నా చిన్నమ్మా పెద్దమ్మా అని ఆప్యాయంగా పలకరించుకుంటూ ముందుకు సాగుతున్న ఆ నడక 3000వేల మైలు రాయిని చేరుకుంది. ప్రజలపక్షాన పోరాడేందుకు, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్ష పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. అడుగులో అడుగు వేసుకుంటూ అటుపెరగని బాటసారిగా సాగిపోతున్న జగన్మోహన్ రెడ్డి యాత్రపై వన్ ఇండియా తెలుగు ప్రత్యేక కధనం..!
అడుగు అడుగునా ఆప్యాయత..! అందరిలో అతడే..! 3000కిమీ చేరుకున్న జగన్ యాత్ర.!!
ఒకటి కాదు, రెండు కాదు, వంద కాదు, వేయి కాదు.., ఏకంగా 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి సరికొత్త రికార్డును నెలకొల్పేరు. ఈ మహా సంకల్ప పాదయాత్ర వెనుక కోట్లాది మంది తెలుగు ప్రజల ఆకాంక్షలు ఉన్నాయి. ఆశలు ఉన్నాయి. తమ బతుకులు మారుతాయన్న కలలూ ఉన్నాయి. వైఎస్. జగన్ మోహన రెడ్డి ప్రజాసంకల్ప యాత్రను తన తండ్రి వైఎస్. రాజశేఖర రెడ్డి జన్మించిన కడప జిల్లా నుంచే ప్రారంభించారు. తన తండ్రి పేరిట పార్టీ స్థాపించిన రోజే ఆయన ఆశయాలను నెరవేరుస్తానని బహిరంగ ప్రకటన చేసారు. 2017వ సంవత్సరం నవంబర్ ఆరున ప్రారంభించిన పాదయాత్ర 3000 కిలోమీటర్లు నిర్విజ్ఞంగా సాగుతోంది. కడపలో ప్రారంభమైన ఈ యాత్ర విజయనగరం జిల్లా శృంగవరపుకోట చేరేసరికి 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.
చరిత్ర సృష్టించిన జగన్..! సంకల్ప యాత్రలో ఆయనే ప్రధాన ఆకర్షణ..!!
ఇది పాదయాత్రల చరిత్రలో ఓ కొత్త రికార్డు. విశాఖపట్నం నుంచి విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన వెంటనే ఈ అరుదైన ఘట్టానికి చేరుకుంది జగన్ యాత్ర. ఈ చారిత్రక ఘట్టానికి నిదర్శనంగా ఆ ప్రాంతంలో ప్రత్యేక ‘పైలాన్'ను ఆవిష్కరించారు జగన్మోహన్ రెడ్డి. పాదయాత్ర సందర్భంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి సంఘీభావంగా ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల్లో ప్రజలు భారీ ఎత్తున తరలివస్తున్నారు. ఈ సభలకు హాజరైన జనాలను చూసి రాజకీయ వర్గాల్లో విపరీతమైన చర్చ సాగుతోంది. గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లతో అధికారానికి దూరమైన జగన్ ఈ సారి ఎలాగైనా అధికార పీఠాన్ని దక్కించుకోవాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు.
రెట్టింపైన అభిమానుల ఉత్పాహం..! సాహో జగన్ అంటున్న క్యాడర్..!!
జగన్ పాదయాత్ర 3000 కిలోమీటర్లు దాటిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అభిమానుల స్పందన అద్బుతంగా ఉంది. విజయనగరంలో పూర్తి చేసుకుని శ్రీకాకుళంలోకి అడుగుపెడితే పదమూడు జిల్లాలో పాదయాత్ర పూర్తయినట్ల అవుతుంది. అయితే ఇది అక్టోబర్ నెలాఖరుకు పూర్తవుతుందా? లేక నవంబర్ వరకూ సాగుతుందా? అన్నది వేచిచూడాల్సిందే. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రతో అధికారాన్ని దక్కించుకున్నారు. అదే తరహాలో చంద్రబాబు కూడా పాదయాత్రతో అధికార పీఠం అధిష్టించారు. మరి ఇదే పాదయాత్ర జగన్ కు అధికార పీఠం అందిస్తుందా? లేదా వేచిచూడాల్సిందే.
నవరత్నాలు క్లిక్కైతే అదికారం ఖాయమైనట్టే..!
ప్రత్యేకించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికల్లో అంత సానుకూల ఫలితాలు రాని ఉత్తరాంధ్ర ప్రాంతంలో జగన్ పాదయాత్ర ఈ మైలురాయిని అధిగమిస్తూ ఉండటం, ఇదే సమయంలో ఇక్కడ జగన్ కు ప్రజల నుంచి అద్వితీయమైన ఆదరణ కనిపిస్తూ ఉండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకూ 106 బహిరంగ సభల్లో కూడా పాల్గొన్నారు జగన్. అలాగే వివిధ వర్గాల ప్రజలతో ఆత్మీయ సమ్మేళనాలను కూడా నిర్వహిస్తూ సాగుతున్నారు. ఒకవైపు తను ఇచ్చే హామీలను ప్రజలకు విడమరిచి చెబుతూ, తనకు ఒకసారి అవకాశం ఇవ్వాలని ముందుకు సాగుతున్నారు జగన్ మోహన్ రెడ్డి. జగన్ ప్రకటించిన ‘నవరత్నాలు' ప్రజలకు కనెక్టు ఐతే వైసీపీకి మంచి రోజులే అనే విషయం తేటతెల్లం అవుతుంది.