ఏపీ సీఎం జగన్ నవనీత్ కౌర్ కే కాదు చాలా మందికి ఇన్స్పిరేషన్... ఎందుకంటే
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుండే దేశం దృష్టిని ఆకర్షించే పనిలో పడ్డాడు. అసెంబ్లీ వేదికగా పార్టీ ఫిరాయింపులు తాను ప్రోత్సహించను అని ప్రకటన చేసిన జగన్ ఒకవేళ ఎవరైనా పార్టీ మారాలనుకుంటే పదవులకు రాజీనామా చేసి పార్టీ మారాలని తేల్చి చెప్పారు. ఇక జగన్ చేసిన వ్యాఖ్యలతో దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ప్రధానంగా జగన్ నిర్ణయం పై చర్చ చేశాయి . చాలా రాజకీయ పార్టీలు జగన్ నిర్ణయాన్ని స్వాగతించాయి.
జగన్ నిర్ణయాలు సంచలనం .. పాలన ఆసక్తికరం
ఇక ఆ తర్వాత రాష్ట్రంలో పారదర్శక పాలన అందిస్తానని, అవినీతి రహిత పాలనే తన ధ్యేయమని చెప్పిన జగన్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై, అవినీతిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించి అవినీతి గుట్టు రట్టు చేయాలని సంకల్పించారు. ఇక అంతే కాక కృష్ణా నది కరకట్ట పై ఉన్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని భావించిన జగన్ అందులో భాగంగా మొట్టమొదట ప్రభుత్వ భవనమైన ప్రజావేదిక కూలగొట్టి అక్రమార్కులను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడానికి, నిరుపేదలందరికీ పౌరసరఫరాలను సక్రమంగా అందించడానికి, శాఖల వారీగా ప్రక్షాళనకు నడుం బిగించిన జగన్ పాలనలో కీలక మార్పులు చేస్తూ తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతున్నారు.
ఎన్నికల్లో విజయంతో ఒక్కసారిగా దేశాన్ని ఆకర్షించిన జగన్ సాగించిన ప్రజా సంకల్ప యాత్ర.. ఇన్స్పిరేషన్ అదే
గత ఎన్నికల ముందు కూడా ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించిన జగన్ ప్రజలతో మమేకమై అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ప్రజా సమస్యలను తెలుసుకోటానికి జగన్ సాగించిన సుదీర్ఘ ప్రస్థానం , జగన్ నడుస్తున్న తీరు, సాగిస్తున్న పాలన నేడు ఎంతో మంది రాజకీయ నాయకులకు స్ఫూర్తినిస్తుందని చెబుతుండడం గమనార్హం. తాజాగా మహారాష్ట్రలోని అమరావతి నుండి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయం సాధించిన సినీ నటి నవనీత్ కౌర్ కూడా ఈరోజు ఒక ఎంపీగా తాను ఎంపిక కావడానికి కారణం ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్ఫూర్తి అని పేర్కొంది. అంతేకాదు ప్రజలతో మమేకమవుతూ రాజకీయాలలో ముందుకు సాగాలన్న నీతిని తాను జగన్ ను చూసే నేర్చుకున్నానని నవనీత్ కౌర్ పేర్కొన్నారు . తెలుగు రాష్ట్రాల్లో పట్ల తనకు ప్రత్యేకమైన అభిమానం ఉందని చెప్పిన ఎంపీ నవనీత్ కౌర్ లోక్సభలో తెలుగురాష్ట్రాల సమస్యలకు తప్పకుండా మద్దతిస్తానంటూ పేర్కొన్నారు .
జగన్ ఎందరో రాజకీయ నాయకులకు స్ఫూర్తి .. ఆనతి కాలంలో దేశం దృష్టిని ఆకర్షించిన సీఎం జగన్
ఒక నవనీత్ కౌర్ మాత్రమే కాదు జగన్ తీసుకుంటున్న నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న వారు, రాజకీయాల్లో జగన్ తరహా పోరాటాన్ని సాగించాలని భావిస్తున్న వారు , ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జగన్ తీరును మెచ్చుకుంటున్న వారు చాలా మంది ప్రస్తుత రాజకీయాల్లో కనిపిస్తున్నారు. అతి తక్కువ సమయంలో ఒక ప్రభావవంతమైన నాయకుడిగా ఎదిగిన జగన్ పై ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రాంతీయ రాజకీయ పార్టీలలో ప్రత్యేకమైన ఆసక్తి కనిపిస్తోంది. తొమ్మిదేళ్లపాటు ప్రతిపక్షంలో ఉండి పాలక పక్షంపై అలుపెరుగని పోరాటం చేసిన జగన్ అధికారంలోకి రావడానికి చేసిన ప్రయత్నం, రాజకీయాల్లో దిట్ట అయిన,అపార అనుభవం ఉన్న చంద్రబాబును ఎన్నికల్లో మట్టి కరిపించిన వైనం చాలా రాజకీయ పార్టీలకు జగన్ సామాన్యుడు కాదనే భావన కలిగించాయి. దీంతో జగన్ రాజకీయ జీవితం ఎంతో మంది రాజకీయ నాయకులకు ఇన్స్పిరేషన్ గా మారింది.