'జగన్ మళ్లీ జైలుకెళ్లడం ఖాయం, ఎప్పుడైనా ఆ నోట్ల గురించి మాట్లాడారా?'
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్, మంత్రి కొల్లు రవీంద్రలు గురువారం నిప్పులు చెరిగారు. జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని కొల్లు అన్నారు.
ప్రాంతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టేందుకు జగన్ చూస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా బందరు పోర్టు వచ్చి తీరుతుందన్నారు. జగన్ నివాసానికి 32 ఎకరాలు అవసరమైనప్పుడు పోర్టుకు భూమి అవసరం లేదా అని ప్రశ్నించారు. కులాల మధ్య చిచ్చు కోసమే చినరాజప్ప ఫోటో పైన వివాదం చేశారన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి చాలా సమయం కేటాయిస్తున్నారని చెప్పారు.
పెద్ద నోట్ల పైన వైయస్ జగన్ ఎప్పుడు మాట్లాడలేదని నారా లోకేష్ అన్నారు. రూ.500, రూ.1000 నోట్ల రద్దు పైన ఎందుకు మాట్లాడలేదో చెప్పాలన్నారు. జగన్ ఎప్పుడైన తన ఆస్తులను ప్రకటించారా అని అడిగారు. వైసిపి అభివృద్ధికి అడ్డుపడుతోందని ఆరోపించారు. 2018 నాటికి బందరు పోర్టు పూర్తి చేస్తామన్నారు.
ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చేసిన ఏకైక పార్టీ టిడిపి అన్నారు. ఈ ఏడాది 50 శాతం సభ్యత్వ నమోదు పెరుగుతుందని చెప్పారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే ప్రతిపక్షాలను తరిమి కొట్టాలన్నారు. ఎవరు అడ్డుకున్నా అభివృద్ధి ఆగదని చెప్పారు.