చిరు వ్యాపారుల ముఖాల్లో చిరునవ్వు; జగనన్న తోడు నగదు జమ; సీఎం జగన్ ఏమన్నారంటే!!
వైయస్ జగన్మోహన్ రెడ్డి చిరు వ్యాపారులకు పెట్టుబడి స్వయంగా వడ్డీలేని రుణాలను అందించే కార్యక్రమం అయిన జగనన్న తోడు పథకంలో భాగంగా నేడు లబ్ధిదారులకు ఖాతాలో నగదును జమ చేశారు సీఎం జగన్ . తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జగనన్న తోడు నిధులను విడుదల చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం 5,10,412 మంది లబ్ధిదారులకు 560.73 కోట్ల రూపాయల లబ్ధిని చేకూర్చినట్టు వెల్లడించారు.
చిరు వ్యాపారులకు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే జగనన్న తోడు పథకాన్ని ప్రారంభించినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం కింద చిరు వ్యాపారులకు ఎటువంటి పూచీకత్తు లేకుండా పదివేల రూపాయలు అందజేయడంతో పాటు, తీసుకున్న రుణానికి ప్రతినెల చెల్లించే మొత్తంలో రుణంపై అయ్యే వడ్డీని కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని జగన్ పేర్కొన్నారు.

ఈ పథకం ద్వారా లబ్ధి పొందే వారిలో దాదాపు 85 శాతం మహిళలే ఉండడం గమనార్హం అని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. సంక్షేమ పథకాల విషయంలో దేశం మొత్తం నెంబర్లు ఒక విధంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సంక్షేమ పథకాల లబ్ధిదారుల నెంబర్లు దేశం మొత్తం కంటే ఎక్కువగా ఉండటం ఒక అరుదైన ఘటన అని సీఎం జగన్ పేర్కొన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా నాలుగో ఏడాదిలో కూడా జగనన్న తోడు నిధులు ఇచ్చామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కీలక భూమిక పోషించి, ఈ పథకం సక్సెస్ అవడానికి పనిచేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. లబ్ధిదారులకు పథకం యొక్క ప్రయోజనాలను అందజేస్తున్న వార్డు, సచివాలయం మెంబర్లకు వాలంటీర్లకు,మెప్మా, సెర్ప్ అధికారులకు సీఎం జగన్మోహన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
సమిష్టి కృషితోనే ఇది సాధ్యమైందని సీఎం జగన్ పేర్కొన్నారు. లబ్ధిదారులకు రుణాలు అందిస్తున్న బ్యాంకర్లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ పథకం ద్వారా ఇప్పటికే ఆరు విడతలుగా చిరు వ్యాపారాలకు ప్రభుత్వ రుణాలు అందజేశామని ఇప్పుడు ఏడో విడత రుణ పంపిణీ చేశామని సీఎం జగన్ పేర్కొన్నారు. చిరు వ్యాపారులకు మేలు చేసేలా వడ్డీలేని రుణాలు ఇచ్చే కార్యక్రమం దేశం లో ఎక్కడా జరగడంలేదని జగన్ అన్నారు.
చిరు వ్యాపారాలు చేసుకుంటూ పొరపాటున ఎవరికైనా జగనన్న తోడు అందకపోతే వారు గ్రామ సచివాలయాలను సంప్రదించాలని సూచించారు. ఈ సంవత్సరం మరో 56 వేల మందికి జగనన్న తోడు అందిస్తున్నామని జగన్ తెలిపారు. అంతేకాదు 11.03 కోట్ల వడ్డీ రియంబర్స్మెంట్ కూడా అందిస్తున్నట్టు సీఎం జగన్ పేర్కొన్నారు. ఇప్పటివరకు 2295 కోట్లు వడ్డీ లేని రుణం అందించామని జగన్ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications