టిడిపిలోకి జగ్గారెడ్డి: మరింత మంది కాంగ్రెస్ నేతలు?
తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. 2019 ఎన్నికలలో పార్టీని అధికారంలోకి తెచ్చేలా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని దీటుగా ఎదుర్కొనగల నాయకులపై దృష్టి సారించారు. ప్రజల్లో బలం ఉన్న నాయకులు కావాలన్న యోచనతో తెలంగాణలో బలమైన రెడ్డి సామాజిక వర్గం ఇటీవల కాంగ్రెస్కు దూరమవడాన్ని గమనిస్తున్నారు. ఈ వర్గాన్ని తమవైపు రప్పించుకుంటే మంచి ఫలితాలు సాధించగలమని భావిస్తున్నారు.
అందులో భాగంగానే జగ్గారెడ్డిపై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు మెదక్ జిల్లా తెలుగుదేశం అధ్యక్షురాలు శశికళా యాదవ రెడ్డి దీనిపై ఆయనతో సంప్రదించారని తెలిసింది. పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఆహ్వానం పలికితే తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమేనని జగ్గారెడ్డి సంకేతాలిచ్చినట్లు భోగట్టా.
ఏ పార్టీలో ఉన్నా జంగారెడ్డి ప్రత్యర్థి పార్టీపై దూకుడు ప్రదర్శిస్తానని, విశ్వసనీయతతో పనిచేస్తానని ఆయన వివరించినట్లు తెలిసింది. మరోవైపు శశికళ జిల్లాలోని ఓ మహిళా నేతసహా ఇతర కాంగ్రెస్ ముఖ్య నాయకులను కూడా సంప్రదించారని రాజకీయవర్గాలు అంటున్నాయి.
జగ్గారెడ్డి బిజెపిలో చేరుతారంటూ గతంలో ప్రచారం సాగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఆయన కలుసుకోవడం కూడా అందుకు ఊతం ఇచ్చింది. బిజెపిలో మెదక్ లోకసభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆయన సిద్ధపడుతున్నట్లు చెప్పారు. కానీ ఆయన మనసు మార్చుకుని కాంగ్రెసులోనే చేరుతానని ప్రకటించారు.