బాబు ముడుపులు తీసుకున్నారు, ఆధారాలున్నాయి: జైరాం రమేష్
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదం చెలరేగుతన్న సమయంలో కాంగ్రెసు నేత జైరాం రమేష్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర విభజన ప్రక్రియలో ఆయన కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. రాష్ట్ర విభజనపై వస్తున్న విమర్శలను కూడా ఆయన తిప్పి కొట్టారు. విభజన శాస్త్రీయంగా జరగలేదని భావిస్తే చట్టంలో మార్పు చేయాలని, తాము మద్దతు ఇస్తామని చెప్పారు.

చంద్రబాబుకు ముడుపులు
పోలవరం ప్రాజెక్టు పనుల్లో చంద్రబాబు ముడుపులు అందాయని, చంద్రబాబు విదేశాల్లో ముడుపులు తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలున్నాయని జైరాం రమేష్ అన్నారు. నాలుగేళ్ల పాటు తెలుగుదేశం ప్రభుత్వం పునాదిరాళ్లకే పరిమితమైందని అన్నారు.

వారివి డ్రామాలే...
ప్రధాని మోడీ, చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారని ఆయన అన్నారు. విభజన చట్టం హామీలను అమలు చేయడంలో టిడిపి, బిజెపి విఫలమయ్యాయని జైరాం రమేష్ అన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయిన తర్వాత విభజన చట్టం హామీలను అమలు చేస్తామని చెప్పారు.

కేంద్రంపై అవిశ్వాసం పెట్టాలి..
కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాలని తాము తెలుగుదేశం, వైయయస్సార్ కాంగ్రెసు పార్టీలను అడుగుతున్నట్లు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. తాము సరైన పంథాలోనే వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జెఎఫ్సిలో ఆయన పనిచేస్తున్న విషయం తెలిసిందే. శనివారంనాడు జెఎఫ్సి సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.

నివేదికలో అన్నీ నిజాలే ఉంటాయి..
మూడు, నాలుగు రోజుల్లో జెఎఫ్సి నివేదిక వస్తుందని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు అందులో అన్నీ నిజాలే ఉంటాయని చెప్పారు. కేంద్రం వివరాలను ఇవ్వడం లేదని, అందుపల్ల బిజెపి నాయకులు చెప్పిన లెక్కలనే తీసుకుంటున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇద్దరు ఐఎఎస్ అధికారులను పంపిస్తోందని చెప్పారు.

జేబులో రాజీనామా లేఖ
జేబులో రాజీనామా లేఖను పట్టుకుని తాను తిరుగుతున్నట్లు పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ చెప్పారు. తిరుపతిలో మోడీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన అడిగారు. బిజెపితో పొత్తు ఉన్నా తాము ఆందోళన చేశామని చెప్పారు. పవన్ కల్యాణ్ కమిటీని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పారు.












Click it and Unblock the Notifications