పార్టీ మార్పుపై జానా, కేసీఆర్పై సభా హక్కుల నోటీసు
హైదరాబాద్: తాను ఫిరాయింపులకు పాల్పడలేదని, రాజీనామా చేసిన తర్వాత పార్టీ మారానని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ శాసన సభాపక్ష నేత జానారెడ్డి మంగళవారం అన్నారు. ఉదయం శాసన సభ సమావేశాలు ప్రారంభం కాగానే ఫిరాయింపుల పైన సభలో గందరగోళం ఏర్పడింది. దీంతో సభాపతి సభను రెండుసార్లు వాయిదా వేశారు.
సభలో అధికార, విపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఫిరాయింపుల పైన చర్చించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబట్టింది. దీని పైన హరీష్ రావు మాట్లాడుతూ.. సభ సజావుగా సాగేందుకు సహకరించాలని కోరారు. సభా సమయం వృథా చేయవద్దన్నారు. స్పీకర్ పరిధిలోని అంశాలు లేవనెత్తవద్దన్నారు. ప్రజా సమస్యలు చర్చించుకుందామని చెప్పారు. ఈ సందర్భంగా జానా పార్టీ మార్పు అంశం వచ్చింది.
దీనిపై జానా స్పందిస్తూ.. తాను పార్టీ ఫిరాయింపులకు పాల్పడలేదన్నారు. తాను రాజీనామా చేసే పార్టీని మారానని తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఫిరాయింపులు సంప్రదాయం కాదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ సభ్యులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.

పోడియం వద్దకు దూసుకు వెళ్లారు. పోడియం వద్దకు వెళ్లవద్దని తమ పార్టీ సభ్యులకు జానా సూచించారు. అయితే, ఆయన మాట వినిపించుకోకుండా ఎమ్మెల్యేలు చొచ్చుకు పోయారు.
అంతకుముందు జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్టీఆర్ను గద్దె దించడంలో కేసీఆర్, చంద్రబాబులే ముందున్నారన్నారు. నాటి వారసత్వాన్నే కేసీఆర్ కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. పార్టీ ఫిరాయిస్తున్న వారిని బర్తరఫ్ చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి తెరాస వైపు వెళ్లిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ సభ్యులు సభాపతిని కలిశారు.
కేసీఆర్ పైన సభా హక్కుల ఉల్లంఘన నోటీసు
కేసీఆర్ పైన సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. ఓ వైపు శాసనసభ సమావేశాలు జరుగుతుంటే, సభకు హాజరుకాకుండా... సభ వెలుపలి నుంచే విధాన పరమైన ప్రకటనలు చేస్తున్నారని కేసీఆర్ పైన కిషన్ మండిపడ్డారు.
సమావేశాలు జరుగుతున్నప్పుడు సభ వెలుపలి నుంచి విధాన పరమైన ప్రకటనలు చేయరాదని రూల్స్ స్పష్టం చేస్తున్నాయన్నారు. నిబంధనలను అతిక్రమించి తెలంగాణ రాష్ట్ర పక్షి, పుష్పం, జంతువు, చెట్టు పేర్లను కేసీఆర్ ప్రకటించారని, అందుకే ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చామన్నారు.












Click it and Unblock the Notifications