జనసేన ఎమ్మెల్యే రాపాక షాకింగ్ కామెంట్స్..! ఆ ఎస్సై ఓ సైకో..!!
జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ మలికిపురం ఎస్సై పై సంచలన ఆరోపణలు చేశారు. పోలీస్ శాఖలో ఇలాంటి ఎస్సైలు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. తనపై కేసు నమోదు చేసిన పరిస్థితులను వెల్లడించిన తన అనుచరులను వేధింపులకు గురి చేస్తున్న కారణంగానే తాను సరెండర్ అయినట్లుగా పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ పై దాడి తాము చేసింది కాదని కొన్ని అరాచక శక్తులు కావాలని చేసినటువంటి దాడి అని ఆయన పేర్కొన్నారు.

చిలికి చిలికి గాలివానలా మారిన ఎమ్మెల్యే రాపాక అరెస్ట్ వ్యవహారం
జనసేన పార్టీ నుంచి గెలిచిన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అరెస్టు వ్యవహారం చిలికి చిలికి గాలివానగా మారుతోంది. మలికిపురం పోలీస్ స్టేషన్ పై అనుచరులతో కలిసి దాడి చేశారన్న ఆరోపణలతో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీచేసిన నేపద్యంలో ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రాజోలు పోలీస్ స్టేషన్ లో తనకు తానే సరెండర్ అయ్యారు. అనుచరులతో కలిసి పోలీస్ స్టేషన్ పై దాడి చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేయగా, కనీసం ఎమ్మెల్యే అన్న గౌరవం కూడా ఇవ్వకుండా పోలీసులు రాపాక వరప్రసాద్ ను దూషించిన ట్లుగా జనసేన నేతలు ఆరోపిస్తున్నారు.

అసలు విషయం చిన్నదే ... రచ్చ మాత్రం చాలా పెద్దది
పేకాట ఆడుతున్నారు అన్న అభియోగంపై ఎమ్మెల్యే అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక తన అనుచరుడు అనారోగ్యంతో ఏదో టైం పాస్ కి ఆడుతున్నారని అతనిని వదిలిపెట్టి అవసరమైతే కేసు నమోదు చేసుకోమని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎస్సైని కోరారు. ఎస్ ఐ ఎమ్మెల్యే అనుచరుడిని విడిచిపెట్టేది లేదని తేల్చి చెప్పారు. దీంతో రాపాక అక్కడనుండి వెనుదిరిగారు. ఆ తర్వాత మలికిపురం పోలీస్ స్టేషన్లో ఎస్సై ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారని జనసేన నేతలు అంటున్నారు.ఇక ఇదే విషయాన్ని స్టేషన్ బెయిల్ పై బయటకు వచ్చిన రాపాక వరప్రసాద్ కూడా మీడియాకు చెప్పారు.
ఎస్సై తనను పాయింట్ బ్లాంక్ లో పెట్టి షూట్ చేసి పారేస్తాం అని స్టేషన్లో వీరంగం వేశారని ఆరోపించిన ఎమ్మెల్యే
కనీసం ఎమ్మెల్యేనన్న గౌరవం కూడా లేకుండా మలికిపురం ఎస్ ఐ దుర్భాష లాడారని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే అయితే ఏం పీకుతాడు.. ఆ పార్టీకి ఉన్న ఒకే ఒక ఎస్సీ ఎమ్మెల్యే.. పాయింట్ బ్లాంక్ లో పెట్టి షూట్ చేసి పారేస్తాం అని స్టేషన్లో వీరంగం వేశారని, ఆ సమయంలో అక్కడ దాదాపు 50 మంది ఉన్నారని జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ పేర్కొన్నారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఎస్ ఐ ని ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్లామని దీనిని మరింత వివాదాస్పదం చేయాలని ఎవరో అరాచక శక్తులు పోలీస్ స్టేషన్ అద్దాలు ధ్వంసం చేశారని, దీంతో తమ పార్టీ నేతలకు కానీ కార్యకర్తలకు గాని ఎలాంటి సంబంధం లేదని ఆయన పేర్కొన్నారు.

సైకో ఎస్సై .. వివాహేతర సంబంధాలు , బూతు పంచాంగాలు.. అంటూ ఎస్సై పై రాపాక వరప్రసాద్ వ్యాఖ్యలు
ఇక అంతే కాదు సదరు ఎస్సై పై సంచలన ఆరోపణలు చేశారు రాపాక వరప్రసాద్ . లా అండ్ ఆర్డర్ కు పనికి రాని ఎస్ఐ ని మలికిపురం పోలీస్ స్టేషన్ కు పంపించారని , పోలీస్ స్టేషన్ కు ఎవరు వచ్చినా సరే ఎస్సై బూతు పంచాంగం వినలేక పోతున్నారని, ఒక సైకో లాగా ఎస్సై ప్రవర్తిస్తున్నాడని ఎమ్మెల్యే రాపాక పేర్కొన్నారు. ప్రస్తుతం మలికిపురం ఎస్ఐ రాజోలు ట్రైనీ ఎస్సైగా ఉన్న సమయంలో ఒక అమ్మాయి తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, అప్పుడు స్థానికులు అతనికి దేహశుద్ధి చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక అంతే కాదు ఇటీవల ఒక ఎస్ టి అమ్మాయి తనను ప్రేమించి గర్భవతిని చేసి మోసం చేశాడంటూ పెళ్లి చేసుకోండి అంటున్నాడు అంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయగా అతని చేసుకోకపోతే నేను చేసుకుంటా లే అని చాలా నీచంగా మాట్లాడాడు అని ఆరోపణలు గుప్పించారు.ఇలాంటి ఎస్ఐ పోలీస్ శాఖ లో ఉంటే పోలీస్ శాఖ పరువు పోతుందని, ఇతని విషయంలో పోలీస్ శాఖ నిర్ణయం తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్.












Click it and Unblock the Notifications