టీడీపీ ప్రభుత్వానికి జనసేన విజ్ఞప్తి...తక్షణమే చర్యలు చేపట్టండి
గుంటూరు: గుంటూరులో వైరల్ హెపటైటిస్ ఆందోళనకర స్థాయిలో ఉందని జనసేన పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. రెండు వారాల క్రితం గుంటూరు నగరంలో డయేరియాతో 23 మందిని పొట్టన బెట్టుకున్నారని, ఆ విషాదం మరవకముందే ఇదే గుంటూరు వైరల్ హెపటైటిస్తో ఇప్పటికే ముగ్గురు మృతి చెందినట్లు జనసేన ఆరోపించింది.
రామిరెడ్డితోట, ప్రకాశ్నగర్, గుంటూరువారి తోట ప్రాంతాల్లో...తాగునీరులో డ్రైనేజీ వాటర్ కలవడంతో ఈ హెపటైటిస్ వ్యాప్తి చెందినట్లు జనసేన పేర్కొంది. హైపటైటిస్ నివారణకు తక్షణమే చర్యలు చేపట్టాలని ఎపి ప్రభుత్వానికి జనసేన విజ్ఞప్తి చేసింది.

డయేరియాతో బాధపడుతూ గుంటూరులోని జీజీహెచ్లో చికిత్స పొందుతున్న బాధితులను పవన్ కళ్యాణ్ మార్చి 16న పరామర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుంటూరులో తాగునీరు కలుషితం కావడంతో 14 మంది చనిపోతే మున్సిపల్ కమిషనర్ పట్టించుకోలేదు. చనిపోయిన ప్రాణాలు తీసుకురాలేం.. ఈ ఘటనకు బాధ్యులెవరు? ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు స్వార్థం కోసమే పని చేశాయి.
అభివృద్ధి..అభివృద్ది అంటున్నారు, కానీ త్రాగునీరు కూడా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వం తక్షణమే మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. 20 మంది ప్రజా ప్రతినిధులు చనిపోతే ఎలా ఉంటుంది.. మీ ఇంట్లో వాళ్లు చనిపోతే ఇలాగే స్పందిస్తారా. సమాజం డ్రైనేజీలా కుళ్లి పోయింది. అసెంబ్లీలో ఈ అంశంపై తూతూ మంత్రంగా చర్చించారంటూ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో గుంటూరులో హైపటైటిస్ వ్యాప్తిపై ఎపి ప్రభుత్వానికి జన సేన లేఖ ప్రాధాన్యం సంతరించుకుంది.












Click it and Unblock the Notifications