ఎన్నికల ఖర్చుకు రూ.2000 కోట్లు కావాలట, జనసేన తొలి విజయం: పవన్, చిరంజీవి సీఎం అవుతారనే
అమరావతి: ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగాలంటే పార్టీకి రూ.2000 కోట్లు కావాలని చాలామంది చెబుతున్నారని, ఇతర పార్టీలు అందుకు సిద్ధంగా ఉన్నాయని అంటున్నారని, కానీ తమ పార్టీ డబ్బు లేకుండానే ఎన్నికల్లో గెలుస్తుందని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చెప్పారు. శనివారం విజయవాడలో చిత్తూరు, ప్రకాశం జిల్లా నాయకులు, అభిమానులతో మాట్లాడారు.
చదవండి: జగన్ ధైర్యం పవన్ కళ్యాణ్! వైసీపీ-టీడీపీ సర్వేలో జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో తెలిసింది!!
వచ్చే అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో 60 శాతం మందికి కొత్త వారికే టిక్కెట్లు ఇస్తానని చెప్పారు. తన సోదరుడు చిరంజీవి ప్రజారాజ్యం అనుభవంతోనే తాను పార్టీ కమిటీలను నియమించలేదని చెప్పారు. టీడీపీ, వైసీపీలకు బూత్ స్థాయి కమిటీలు ఉన్నాయా అని ప్రశ్నించారు. లెఫ్ట్, బీజేపీ వంటి పార్టీలకు ఇప్పటికే కొంత మేర బూత్ స్థాయి కమిటీలున్నాయని, మరి వారు ఎందుకు గెలవడం లేదన్నారు.
క్రమంగా విస్తరించుదాం
తన అభిమానులకు, తనకు అనుసంధానం ఉందని, యువత, మహిళలు జనసేనను ప్రజల్లోకి బాగా తీసుకువెళ్తున్నారని పవన్ కళ్యాణ్ చెప్పారు. పార్టీని క్రమక్రమంగా విస్తరించుదామని చెప్పారు. ప్రస్తుతం పార్లమెంట్ స్థాయి కమిటీలు వేద్దామన్నారు. ఈ ఎన్నికలు మనకు మొదటి ఎన్నికలో, చివరి ఎన్నికలో కావని, ఇది ప్రారంభం మాత్రమేనని చెప్పారు. భవిష్యత్తు జనసేనదే అన్నారు. జనసేన ఇంకా ప్రారంభదశలో ఉందని, పార్టీ సంస్థగత పటిష్టతకు కొంత సమయం పడుతుందన్నారు. ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలన్నారు.
జనసేన తొలి విజయం, కాలం మనకు అనుకూలం, ఇదే నిదర్శనం
మొదట్లో జనసేన పార్టీను గుర్తించడానికి టీడీపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలు ఇష్టపడని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు జనసేన తమతో కలిసి వస్తోందని ప్రచారం చేసుకోవడమే మన తొలి విజయం అన్నారు. వాళ్లకు మన అవసరం ఉందేమో కానీ, మనకు వారి అవసరం లేదని తేల్చి చెప్పారు. తెలియకుండానే సామాన్యులు వాడే గాజు గ్లాస్ ఎన్నికల గుర్తుగా వచ్చిందని చెప్పారు. కాలం మనకు అనుకూలంగా ఉందనేందుకు ఇది నిదర్శనం అన్నారు. రిస్క్ చేయకుంటే కొత్తదనం రాదని చెప్పారు.
చిరంజీవి ముఖ్యమంత్రి అయితే అధికార ఫలాలు
ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావానికి బలమైన పాత్ర పోషించిన వ్యక్తిలో నేను ఒకడినని, డబ్బు ప్రభావం లేని రాజకీయాలు చేయాలన్న లక్ష్యంతో పార్టీ ఏర్పాటయిందని, చిరంజీవి వంటి ప్రజాదరణ ఉన్న వ్యక్తి వస్తే అవినీతి అంతమవుతుందని, సామాజిక న్యాయం జరుగుతుందని నాడు ప్రజలు ఆకాంక్షించారని, అయితే అది పక్కదారి పట్టిందని పవన్ అన్నారు. చిరంజీవి ముఖ్యమంత్రి అవుతారని, అధికార ఫలాలు అనుభవించవచ్చునని, ఎవరెవరో పార్టీలోకి వచ్చారని, ఓడిపోగానే వెళ్లిపోయారని వాపోయారు. దానివల్ల పీఆర్పీ లక్ష్యం నీరుగారిందన్నారు.
వారంతా పదవీ వ్యామోహంతో వచ్చారు
ఆనాడు ప్రజారాజ్యం పార్టీలోకి వచ్చిన వారంతా పదవీ వ్యామోహంతో వచ్చినవారేనని, అందువల్ల జనసేన నిర్మాణంలో ఆచితూచి అడుగులు వేస్తున్నామని పవన్ చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ సమయంలో రాజకీయంగా అనేక దెబ్బలు తిన్నామని, దెబ్బలు తినే కొద్ది నేను మరింత రాటుదేలుతానని చెప్పారు. ప్రజారాజ్యం పార్టీ అనుభవాలు దృష్టిలో ఉంచుకొని పార్టీ కమిటీల నియామకాలకు తొందరపడలేదని, రాత్రికి రాత్రే రాజకీయాల్లో ఎవరూ ఎదగలేరని, కనీసం పాతిక సంవత్సరాలు ఓపిక పట్టాలన్నారు.
పాలకుల తప్పిదం వల్ల తెలంగాణ విడిపోయింది
పాలకులు చేసిన తప్పిదం వల్ల తెలంగాణ రాష్ట్రం విడిపోయిందని పవన్ అన్నారు. ఎవరో చేసిన తప్పులకు అమాయకులైన ప్రజలు శిక్ష అనుభవించారని, సొంత రాష్ట్రంలోనే పరాయివాళ్లుగా మిగిలిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పారు. నేను సినిమాల్లోకి రాకముందు సమాజాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నానని చెప్పారు. కళాశాల నుంచి పట్టాలు తీసుకోకపోయినా, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ పాలసీలు, దేశంలో కులాల వాటి ప్రభావం వంటి వాటి గురించి సంపూర్ణంగా తెలుసుకున్నానని చెప్పారు. 2014లో నవ్యాంధ్ర కోసం టీడీపీకి మద్దతిచ్చామని, 2019లో సమతుల్యత కోసం అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పారు. వ్యక్తిగతంగా ప్రజాబలం ఉన్న వారు పార్టీలోకి వస్తే జనసేన బలం తోడై విజయానికి చేరువ అవుతారన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో మధ్యేమార్గం అవసరమన్నారు.