కమలానికి పవన్ విడాకులేనా? -బీజేపీ వల్ల జనసేనకు భారీ నష్టం -తిరుపతిలో ఒంటరిగా బరిలోకి!
ప్రధాని మోదీపై నమ్మకంతో బీజేపీకి దగ్గరైతే స్థానిక నేతలు అలుసుగా చూస్తున్నారని, అడుగడుగునా అవమానిస్తున్నారంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వెళ్లగక్కిన ఆవేదన ఇప్పుడు ఆగ్రహంగా మారిందా? బీజేపీని, కేంద్రం తీరును విమర్శించడంలో రెండేళ్ల కిందట వాడిన మాటల్నే సేనాని మళ్లీ వాడటం చెడిపోయిన దోస్తీకి సంకేతమా? కమలానికి విడాకులు ఇచ్చేసి పవన్ తన దారిలో ప్రయాణించనున్నారా? అంటే జనసేన వైపు నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది.

బీజేపీ వల్ల భారీ నష్టం
విభజన కారణంగా నష్టపోయిన ఏపీకి న్యాయం చేస్తానని ప్రధాని మోదీ హామీ ఇవ్వడం వల్లే బీజేపీతో పొత్తు పెట్టుకున్నానని, ఏపీకి బీజేపీ న్యాయం చేయకపోగా, తెలంగాణ శాఖ నేతలు చులకనగా మాట్లాడారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేయడం, ఇకపై బీజేపీతో కలిసి పనిచేయలేమని స్పష్టంగా చెప్పడం తెలుగు రాష్ట్రల్లో చర్చనీయాంశమైంది. పవన్ ను ఓదార్చాల్సింది పోయి, టీబీజేపీ నేతలు ఇంకాస్త కటువుగా సేనానిని విమర్శించడంతో దాని ప్రభావం ఏపీ రాజకీయాలపై కనిపించింది. ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ వల్ల జనసేనకు భారీగా నష్టం కలిగిందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిని మహేశ్ తీవ్రస్థాయిలో విమర్శించారు.

అమరావతిపై కమలం దొంగాట..
జనసేన ముఖ్యనేత పోతిన మహేశ్ సోవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీపై, అమరావతి పరిరక్షణ సమితిపై నిప్పులు చెరిగారు. ''కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని అమరావతే రాజధానిగా ఉండాలని అన్ని రాజకీయ పార్టీలు ప్రకటించాయి. అలాంటప్పుడు విజయవాడ, గుంటూరు మున్సిపల్ ఎన్నికలను ఎందుకంత సీరియస్ గా తీసుకోలేదు? అమరావతి పరిరక్షణ సమితి అనే సంస్థ కేవలం ఫోటోల కోసమే ఉద్యమాలు చేస్తుందా? అమరావతి రాజధానిని వ్యతిరేకించినవాళ్లకు ఓటు వేయవద్దని సమితి ఎందుకు పిలుపు ఇవ్వలేదు? దీంతో..

ఎస్సీ, ముస్లింల్లో వ్యతిరేకత
రాజధానిపై పరిరక్షణ సమితి స్పష్టమైన విధానం ప్రకటించకపోవడం వల్ల గుంటూరు జిల్లాలో జనసేన దెబ్బతింటే, విజయవాడలోనైతే అచ్చంగా బీజేపీ వల్లే భారీగా నష్టపోయాం. (మతవాద పార్టీగా) బీజేపీకి ఉన్న గుర్తింపు రీత్యా వాళ్లతో పొత్తు పెట్టుకున్న మేం ఎక్కడికి వెళ్లినా ఎస్సీ, ఎస్టీ, ముస్లింలు వ్యతిరేకించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జనసేన ఓటమికి నూరుశాతం బీజేపీనే కారణం. విడయవాడలో అండగా ఉంటామన్న బీజేపీ ఏ దశలోనూ ఆ పనిచేయలేదు'' అని మహేశ్ మండిపడ్డారు. నిజానికి..

కూటమిలో జూనియర్ ఎవరు?
వివిధ రాష్ట్రాల్లో భిన్న ఐడియాలజీలున్న పార్టీలతో పొత్తులు పెట్టుకోవడం బీజేపీకి ముందునుంచీ అలవాటే. బీహార్ లో నితీశ్ నేతృత్వంలోని జేడీయూతో జూనియర్ భాగస్వామిగా కొనసాగిన బీజేపీ.. గతేడాది ఎక్కువ సీట్లు సాదించినా, నితీశ్ కుమార్ నే సీఎంగా కొనసాగిస్తున్నది. అదే తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి బీజేపీ కంటే మెరుగైన ఓటు బ్యాంకు కలిగిన పవన్ కల్యాణ్ ను మాత్రం జూనియర్ గా భావిస్తుండటం, పెద్దగా లెక్కచేయకపోవడం, ఢిల్లీకి వెళ్లినా అపాయింట్మెంట్ ఇవ్వకుండా హైకమాండ్ అదోరంకంగా వ్యవహరించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా వెల్లడైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనూ జనసేనకు 4.67 శాతం ఓట్లు దక్కగా, బీజేపీకి కేవలం 2.41శాతం ఓట్లే దక్కాయి. తొలుత పవన్ విమర్శలు, అటుపై పార్టీ సైనికులు ఒక్కొక్కరిగా బీజేపీని టార్గెట్ చేస్తోన్న వైనం చివరికి తెగదెంపులకే దారితీయబోతోందనే చర్చ జరుగుతోంది. అదే క్రమంలో..

తిరుపతిలో జనసేన ఒంటరి పోరు?
బీజేపీ చేతిలో వరుస అవమానాలు ఎదుర్కొంటున్న పవన్ కల్యాణ్ ఇక పొత్తుకు మంగళం పాడబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. తెలంగాణలోనైతే ఇప్పటికీ 'పవన్ ఉంటే ఎంత, పోతే ఎంత' తరహాలో బీజేపీ నేతలు వ్యవహరిస్తుండగా, ఈ పరిణామాలపై, పవన్ చేసిన కామెంట్లపై స్పందించకుండా ఏపీ బీజేపీ నేతలు గమ్మున ఉండిపోయారు. ఏపీలో ఏ సీటు కోసమైతే తెలంగాణలో తాను త్యాగం చేశానో ఆ తిరుపతి సీటునే కాకుండా చేశారనే ఆక్రోషం కూడా పవన్ వెళ్లగక్కుతున్నారని, అవసరమైతే నోటిఫికేషన్ వచ్చేలోపే బీజేపీకి విడాకులిచ్చేసి తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో జనసేన ఒంటరిగా బరిలోకి దిగే అవకాశాలూ లేకపోలేవని వినికిడి. బీజేపీతో పొత్తు తెగదెంపులు, తిరుపతిలో జనసేన ఒంటరి పోరు అంశాలపై రెండు పార్టీల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.












Click it and Unblock the Notifications