ప్రాధేయపడ్డా, భయపడట్లేదు: అదే కాకినాడలో వెంకయ్య, షాకిచ్చిన 'జనసేన'
కాకినాడ: కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు సభలో జనసేన పార్టీ కార్యకర్తలు శుక్రవారం నాడు నిరసన తెలిపారు. నల్లటి బెలూన్లు ఎగిరేసి వారు తమ నిరసనను వ్యక్తం చేశారు. కాకినాడలో శుక్రవారం నాడు ఏపీకి ఆర్థిక సహకారం, ప్యాకేజీ పైన బీజేపీ సభ నిర్వహించింది.
ఈ సభలో వెంకయ్య మాట్లాడారు.ప్రత్యేక హోదా పైన మరోసారి క్లారిటీ ఇచ్చారు. కేవలం సరిహద్దు రాష్ట్రాలకు మాత్రమే ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పారు. నాడు విభజన సమయంలో ఏపీకి న్యాయం చేయమని, ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టమని ప్రాదేయపడ్డాను, పోరాడానని చెప్పారు.
కానీ వారు చట్టంలో పెట్టలేదని చెప్పారు. మోడీ ప్రభుత్వం ఏపీ రెవెన్యూను భర్తీ చేసేందుకు అంగీకరించిందని చెప్పారు. పోలవరం ఖర్చులను కూడా కేంద్రమే భరిస్తుందన్నారు. ఈ అయిదేళ్లలో ఏపీకి కేంద్రం ఇచ్చే నిధులు రూ.2,06,819 కోట్లు అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని కొందరు చెబుతున్నారని, కానీ ఏపీ సీఎంకు భయపడాల్సిన అవసరం లేదని వైసిపిని, జనసేన పార్టీలను ఉద్దేశించి పరోక్షంగా అన్నారు.
విభజనతో నష్టపోయిన ఏపీని అన్ని విధాలా ఆదుకునేందుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఏపీకి ఐదేళ్లలో ఇస్తున్న రూ.2,06,819 కోట్లు ఖర్చుచేస్తే రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుందన్నారు. పోలవరం ప్రాజెక్టుకు 1982లో అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారని, అప్పటినుంచి కదలిక లేకుండా ఉందన్నారు.
ఎన్డీయే అధికారంలోకి వచ్చాక పోలవరానికి నిధులు కేటాయించి నిర్మాణ పనులు ప్రారంభించామన్నారు. పోలవరం ప్రాజెక్టు రాష్ట్రానికి మోడీ ఇచ్చిన వరమన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించామని, దానికయ్యే వ్యయమంతా కేంద్రమే భరిస్తుందన్నారు.
జనసేన ఆందోళన
వెంకయ్య నాయుడు మాట్లాడుతుండగా పలువురు జనసేన కార్యకర్తలు నిరసన తెలిపారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని వారు నినాదాలు చేశారు. అనంతరం నల్లటి బెలూన్లను ఎగరవేశారు. కాగా, గతంలో పవన్ నిర్వహించిన కాకినాడలోనే వెంకయ్య నాయుడు సభ నిర్వహించడం గమనార్హం. ఇదిలా ఉండగా, వెంకయ్య సభకు వర్షం అంతరాయం కలిగించింది.