నేడు ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ - అసలు అజెండా ఇదే..!!
ప్రధాని మోదీ రెండు రోజుల ఏపీ పర్యటనలో భాగంగా ఈ సాయంత్రం విశాఖ రానున్నారు. గవర్నర్ - సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలకేందుకు సాయంత్రం విశాఖ చేరుకుంటారు. ఇదే సమయంలో విశాఖలో అందుబాటులో ఉండాలని జనసేనాని పవన్ కల్యాణ్ కు సమాచారం అందింది.నేవీ అతిథిగృహం ఐఎన్ఎస్ చోళాలో శుక్రవారం రాత్రి 8.30 గంటలకు బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో మోదీ సమావేశం కానున్నారు. ఆ తర్వాత పవన్ను విందు భేటీలో కలుస్తారని తెలిసింది.

ప్రధానితో పవన్ భేటీ వేళ
ఒకవేళ ఆ సమయంలో కుదరకపోతే శనివారం ఉదయం అల్పాహారం సమయంలో కలుసుకునే అవకాశం ఉందని సమాచారం. ఏపీలో తిరిగి టీడీపీ అధినేత చంద్రబాబు - పవన్ కల్యాణ్ మధ్య పొత్తు వార్తలు వస్తున్న నేపథ్యంలో జనసేనాని బీజేపీని వీడటానికి సిద్దమైనట్లుగా కమలనాధులు అంచనాకు వచ్చారు. టీడీపీతో కాకుండా.. తమతోనే కొనసాగేలా పవన్ ను ఒప్పించేందుకు బీజేపీ నేతలు ఇప్పటికే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, పవన్ 2014 ఎన్నికల తరహాలో తిరిగి మూడు పార్టీలు కలిసి పోటీ చేయటం ద్వారా వ్యతిరేక ఓటు చీలకుండా వైసీపీని ఓడించాలనే వ్యూహంతో ఉన్నారు. దీనికి సంబంధించి పవన్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, ఇప్పుడు ప్రధానితో సమావేశమైన సమయంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వ వ్యవహార శైలి గురించి పవన్ ఫిర్యాదు చేయనున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు.

బీజేపీతో కలిసి కొనసాగటమేనా
ప్రధానిని కలిసేందుకు శుక్రవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రత్యేక విమానంలో పవన్ హైదరాబాద్ నుంచి విశాఖ చేరుకోనున్నారు. ఆదివారం వరకూ నగరంలోనే ఉంటారు. ఈ భేటీపై జనసేన స్పందించకపోవడం గమనార్హం. ఈ నెల 12, 13, 14 తేదీల్లో జగన్న ఇళ్లు, టిడ్కో ఇళ్లపై ఆ పార్టీ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. ఈ మూడు రోజుల్లో ఒక రోజు పవన్ విశాఖ లేదా విజయవాడలో టిడ్కో ఇళ్లను పరిశీలించనున్నారు. 2014 ఎన్నికల ప్రచారంలో మోదీ - పవన్ కలిసి సభల్లో పాల్గొన్నారు. ఆ తరువాత ఇద్దరూ ఇప్పటి వరకు కలవలేదు. కొద్ది నెలల క్రితం భీమవరం లో జరిగిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు రావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆహ్వానించారు. కానీ, పవన్ హాజరు కాలేదు.

2019 ఎన్నికలకు కీలక అడుగు
విశాఖ పర్యటన తరువాత పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ అంటే తనకు గౌరవమున్నా.. ఎవరికీ లోబడి ఉండనని.. రాష్ట్రం కోసం సొంత నిర్ణయాలు తీసుకుంటానంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ప్రధానితో సమావేశంలో పవన్ ఏం మాట్లాబోతున్నారు.. కేవలం వైసీపీ ప్రభుత్వం పైన ఫిర్యాదులకే పరిమితం అవుతారా..భవిష్యత్ లొ బీజేపీ - జనసేన పొత్తు పైన హామీ ఇస్తారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది. ఇక, టీడీపీ అంశం ఇప్పటికిప్పుడు పవన్ కల్యాణ్ ప్రస్తావించే అవకాశం ఉండనది.. ప్రధాని ఆ అవకాశం ఇవ్వరని బీజేపీ నేతల అంచనా. 2024 ఎన్నికల లక్ష్యంగా ఏపీలో రాజకీయ పార్టీలు అడుగులు వేస్తున్న సమయంలో ప్రధానితో పవన్ కల్యాణ్ భేటీ ఆసక్తిని పెంచుతోంది.












Click it and Unblock the Notifications