''ఇప్పటికైనా మారండి.. దానికి ఓటు వేయడం మానండి!''
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరగబోయే ఎన్నికలు రాష్ట్రంలోని ప్రతి రాజకీయ పార్టీకి అత్యంత కీలకంగా మారాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావాలని వైసీపీ, కచ్చితంగా విజయం సాధించాలని తెలుగుదేశం, పదుల సంఖ్యలో ఎమ్మెల్యేలు అసెంబ్లీలోకి అడుగుపెట్టాలని జనసేన పట్టుదలగా ఉన్నాయి. అందుకనుగుణంగా ఆయా పార్టీల అధినేతలు తమ వ్యూహాలను పదునెక్కించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఈ పార్టీల మధ్య హోరాహోరీ పోరు తథ్యమని స్పష్టమవుతోంది. ప్రతి ఓటును జాగ్రత్తగా ఒడిసిపట్టడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఓటు అత్యంత కీలకంగా మారబోతోంది.

నోటాకు ఓటువేసి ఏం సాధించారు?
ఇటీవల మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో రెండురోజులపాటు నిర్వహించిన సమీక్షా సమావేశాల్లో పవన్ కల్యాణ్ నోటాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎన్నికల్లో నోటాకు ఓటువేయడం మానుకోవాలన్నారు. 2019 ఎన్నికల్లో 4శాతం ఓట్లు అంటే దాదాపు 10 లక్షల మంది నోటాకు ఓటువేయడంద్వారా క్రమినల్స్ కు సహకారం అందించారని పవన్ వ్యాఖ్యానించారు. మేధావుల పేరుతో కొందరు నోటాకు ఓటువేసి రాష్ట్రానికి నష్టం చేశారన్నారు. తమకు ఆ పార్టీ అంటే ఇష్టం లేదని, ఆ పార్టీ అంటే ఇష్టం లేదని చెబుతుంటారు. అదేమంటే మేం మేధావులని చెబుతారు. కానీ మీరంతా నోటాకు ఓటు వేసి ఏం సాధించారని ప్రశ్నించారు.

పాస్ పోర్టును చించేయండి!
ఇలాంటివారు ఈ దేశం నచ్చలేదని తమ పాస్ పోర్టు ను కూడా చింపేసుకోవాలన్నారు. ప్రయోజనాలు మాత్రం అన్నీ తీసుకుంటారని, అది మేధావుల సంకుచిత దృష్టి అని, ఉన్నవాళ్లలోనే ఏదో ఒక వ్యక్తికి విలువైన ఓటు వేయాలని సూచించారు. ఎన్నికల్లో నోటాకు ఓటు వేసినవారిపై అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం నోటాకు ఓటు వేసేలా అవకాశం కల్పించింది. అయితే దీనిపై ఎప్పటికప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ రాజకీయ నేతల పట్ల తమ అసంతృప్తిని తెలియజేయడానికి ఇది సరైన మార్గమని కొందరు భావిస్తున్నారు.

నోటాకు ఓటు వేస్తే అది వృథా!
నోటాకు ఓటు వేస్తే అది వృథా చేసుకోవడమేనని పవన్ కల్యాణ్ అంటున్నారు. ఓటమిపాలయ్యేవారికి ఓటు వేస్తే వృథా అవుతుందని కొందరు చెబుతుంటారని, అప్పుడు ఓటు వృథా గురించి ఆలోచించేవారు నోటాకు వేస్తే వృథా అవుతుందని ఎందుకు భావించరని నిలదీశారు. నోటాకు ఓటు వేసినవారివల్లే క్రిమినల్స్ రాజ్యమేలుతున్నారన్నారు. పరోక్షంగా నోటాకు ఓటువేసే మేధావులంతా క్రిమినల్స్ కే మద్దతిచ్చినట్లనన్నారు. ఎక్కువ మంది ఓటు వేయడానికి రావాలని, ఎవరో ఒకరికి ఓటు వేయాలని జనసేనాని పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications