పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో ?.. 28 మంది వైసీపీ ఎంపీలతో నో యూజ్: పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్కి నిధులు తీసుకురావడంతో జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపై ప్రస్తావనే లేదన్నారు. పేరుకే 28 మంది వైసీపీ ఎంపీలు ఉన్నారు. వారి వలన ఏపీకి ఎలాంటి ప్రయోజనం లేదని పవన్ దుయ్యబట్టారు. వారు సాధించింది శూన్యమని విమర్శించారు.

28 మంది ఎంపీలతో నో యూజ్..
జాతీయ ప్రాజెక్టు హోదాలో ఏపీ జీవనాడి పోలవరానికి 2022-23 బడ్జెట్ లో కేటాయింపులే కన్పించలేదని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులోని లోక్ సభలో 22 మంది వైసీపీ ఎంపీలు, రాజ్యసభలో ఆరుగురు వైసీపీ సభ్యలు ఉండి ఏం ప్రయోజనమని ఆగ్రహం వ్యకం చేశారు. ఢిల్లీలో కూర్చుని ఏం సాధించారని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు నిధుల సాధనలో ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పవన్ నిలదీశారు.

జగన్ ఢిల్లీ పర్యటనలోసాధించిందేమిటి?
వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వం వద్ద కనీసం పోలవరం ప్రాజెక్టు గురించి ప్రస్తావించారా.. లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి పోలవరం గురించి అడిగాం అని చెప్తుంటారు. కానీ కేంద్ర బడ్జెట్ పోలవరం ఊసే లేదన్నారు. రాష్ట్రంలో జగన్ అధికారం చేపట్టిన తర్వాత పోలవరం నుంచి ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి అందుకున్న నిధులు కేవలం రూ. 5,163.2 కోట్లు మాత్రమే అని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈవిధంగా వ్యవహరిస్తే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందని ప్రశ్నించారు.

పోలవరం ప్రాజెక్టు నిధుల సాధనలో నిర్లక్ష్యం
కేంద్ర బడ్జెట్లో యమునకు ఉప నదులైన కెన్ -బెత్వా ప్రాజెక్టు కోసం మాత్రం రూ.44 వేల కోట్లు కేటాయిస్తూ ప్రతిపాదనలు ఉన్నాయని పవన్ పేర్కొన్నారు. దీనిని బట్టి జలరంగానికి కేంద్రం సానుకూలంగా ఉంది. కానీ, పోలవరం విషయంలో వైసీపీ ప్రభుత్వమే అలసత్వం చేస్తోందని స్పష్టంగా అర్థమవుతోందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిధుల సాధనలో జగన్ ప్రభుత్వం ఎందుకింత నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.

పోలవరం ఎప్పటికీ పూర్తవుతుందో?
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలనే సంకల్పం వైసీపీ ప్రభుత్వానికి ఉన్నట్లు లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈప్రాజెక్టు పూర్తయితే దాదాపు 30.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అంతే కాకుండా 28 లక్షల మందికి తాగు నీరు అందించవచ్చని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం రూ. 47,725 కోట్ల మేరకు పెంచడానికి సాంకేతిక మండలి అంగీకరించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ నుంచి నిధలు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని పవన్ నిలదీశారు. జగన్ ప్రభుత్వ అలసత్వాన్ని చూస్తుంటే పోలవరం ప్రాజెక్టు ఎప్పటికీ పూర్తవుతుందో కూడా అంచనాలకు అందడం లేదని విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications