"రోడ్ల"పై పవన్ పోరాటం - సీఎం టార్గెట్ పూర్తయింది : నేటి నుంచి మరో క్యాంపెయిన్..!!
ముఖ్యమంత్రి జగన్ పైన జనసేనాని మరో పోరాటం ప్రారంభించారు. సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్న రోడ్ల అంశం పైన మరోసారి ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తున్నారు. గతంలో ఏపీ రోడ్ల దుస్థితి పైన జనసేన డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించింది. ఆ తరువాత ప్రభుత్వం ఏపీలో రోడ్ల మరమ్మత్తుల పైన నిర్ణయం తీసుకుంది. సీఎం వద్ద జరిగిన సమీక్షలోనే రోడ్ల రిపేర్లకు సంబంధించి డెడ్ లైన్ ఫిక్స్ చేసారు. జూలై 15వ తేదీ లోగా రాష్ట్రంలోని అన్ని రోడ్ల మరమ్మత్తులు పూర్తి కావాలని సీఎం జగన్ నాడు ఆదేశించారు.
ముగిసిన సీఎం నిర్దేశించిన గడువు
ఆ తరువాత బాగు చేసిన రోడ్ల ఫొటోలోను... గతంలో ఉన్న రోడ్ల దుస్థితిని వివరిస్తూ ఫొటోలు ప్రదర్శించాలని సూచించారు. కానీ, ఇప్పుడు జూలై 15 వచ్చేసింది. దీంతో..మరోసారి జనసేన ఇదే అంశం పైన ప్రచారం ప్రారంభించింది. ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు మరోసారి రోడ్ల ఇబ్బందుల పైన డిజిటల్ క్యాంపెయిన్ కు సిద్దమైంది. తొలి ట్వీట్ జనసేన అధినేత పవన్ నుంచే మొదలైంది. గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ.. ఒక కార్టూన్ ను పవన్ ట్వీట్ చేసారు. గతంలో ఇదే రకంగా రోడ్ల పైన జనసేన నిర్వహించిన డిజిటల్ క్యాంపెయిన్ కు భారీ స్పందన వచ్చిది. సోషల్ మీడియాలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చిన ఫొటోలను షేర్ చేసారు. పవన్ కళ్యాణ్ సైతం కాకినాడ - అనంతపురంలో రోడ్ల రిపేర్ల కోసం శ్రమదానం చేసారు.

రాజకీయంగా ఇరుకున పెట్టేలా
ఇక, ఏపీలో రోడ్ల గురించి గతంలో తెలంగాణ మంత్రి చేసిన వ్యాఖ్యలు..ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చేసిన కామెంట్స్ సైతం వైరల్ అయ్యాయి. ఇప్పుడు తిరగి వర్షాలు కురుస్తున్న సమయంలో రోడ్ల పరిస్థితి అనేక ప్రాంతాల్లో ఆధ్వాన్నంగా మారింది. ఇప్పుడు ఇదే అంశాన్ని జనసేన అధినేత రాజకీయంగా అస్త్రంగా మలచుకున్నారు. సామాన్యులను కనెక్ట్ అయ్యే అంశం కావటంతో దీని ద్వారా ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ మహానాడు - వైసీపీ ప్లీనరీ తరువాత రాజకీయంగా వచ్చే ఎన్నికల దిశగా అన్ని పార్టీలు అడుగులు వేస్తున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్టోబర్ 5 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్దమయ్యారు.
జనసేనాని కొత్త స్లోగన్ తో మరోసారి
ప్రతీ వారం సామాన్యుల నుంచి ఫిర్యాదుల స్వీకరణ కోసం పవన్ కళ్యాణ్ జన వాణీ నిర్వహిస్తున్నారు. దీనికి స్పందన భారీగా కనిపిస్తోంది. ఇక, కౌలు రైతులకు మద్దతుగా నిలిచేందుకు ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అయిదు లక్షల చొప్పున పవన్ సాయం అందిస్తున్నారు. పొత్తుల అంశం తేలటానికి సమయం పట్టనుండటంతో..ముందుగా పార్టీ పరంగా బలోపేతం అవ్వటం పైన ఫోకస్ పెట్టారు. ఇక, ఇప్పుడు గోదావరి జిల్లాల్లో పర్యటనకు పవన్ సిద్దమవుతున్నారు. ఈ సమయంలోనే గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ చేస్తున్న డిజిటల్ క్యాంపెయిన్ కు ఇప్పుడు స్పందన కనిపిస్తోంది. మూడు రోజుల సమయంలో సామాన్యుల నుంచి దీనికి మద్దతు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications