అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతుగా జనసేన.. 26వ తేదీన నెల్లూరులో రైతులకు సంఘీభావం
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అమరావతి ప్రాంత రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. దాదాపుగా రెండు సంవత్సరాలుగా అమరావతి రైతులు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. 3 రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, సీఆర్డీఏ రద్దు బిల్లును కూడా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు ఉద్యమాన్ని విస్తరించడంలో భాగంగా మహాపాదయాత్ర నిర్వహిస్తున్నారు.
పాదయాత్ర చేస్తున్న మహిళా రైతుల పాదాలకు పాలాభిషేకం; నెల్లూరులో 24వ రోజు పాదయాత్ర ఇలా!!
రాజధాని రైతుల పాదయాత్రకు టీడీపీ మద్దతు
రాజధాని అమరావతి రైతులు నిర్వహిస్తున్న మహాపాదయాత్రకు వివిధ జిల్లాల ప్రజల నుండి విశేష మద్దతు లభిస్తుంది. ప్రస్తుతం పాదయాత్ర గుంటూరు, ప్రకాశం జిల్లాలను దాటుకొని నెల్లూరు జిల్లాలో కొనసాగుతోంది. ఇప్పటికే రైతులు నిర్వహిస్తున్న మహా పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ తమ మద్దతును ప్రకటించింది. అమరావతి రైతుల పక్షాన తాము కూడా పోరాటం సాగిస్తామని తేల్చి చెబుతోంది. రాజధానిగా అమరావతి నగరమే ఉండాలని టిడిపి ఆకాంక్షిస్తోంది.
అమరావతినే రాజధాని అంటూ ..రంగంలోకి దిగిన బీజేపీ
ఇక తాజాగా బిజెపి కూడా రాజధాని రైతుల పోరాటానికి మద్దతుగా మేము సైతం అంటూ కార్యక్షేత్రం లోకి దిగింది. ఇటీవల బీజేపీ నేతలు అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొని వారికి సంఘీభావం ప్రకటించారు. రాజధాని అమరావతిని ఎవరూ మార్చలేరని, మూడు రాజధానులు నిర్మాణం సాధ్యం కాదని బిజెపి నేతలు సైతం స్పష్టం చేస్తున్నారు. అమరావతి రైతుల పోరాటానికి బిజెపి అండగా నిలుస్తుందని తేల్చి చెబుతున్నారు. జగన్ సర్కార్ మూడు రాజధానుల నిర్ణయాన్ని మార్చుకుని అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
అమరావతి రైతుల మహా పాదయాత్రకు జనసేన మద్దతు
ఇదిలా ఉంటే తాజాగా రాజధాని అమరావతి కోసం అమరావతి రైతులు సాగిస్తున్న పోరాటానికి బాసటగా నిలవాలని జనసేన పార్టీ నిర్ణయించింది. రైతుల ఉద్యమానికి ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే మద్దతు తెలిపిన క్రమంలో తాజాగా జనసేన కూడా అమరావతి రైతుల పక్షాన పోరుబాట పట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీన జనసేన పార్టీ ముఖ్య నేతలు రాజధాని రైతుల మహాపాదయాత్ర లో పాల్గొననున్నట్టు జనసేన పార్టీ అధికారికంగా ప్రకటన చేసింది. నెల్లూరు జిల్లాలో రాజధాని రైతులతో కలిసి జనసేన పిఎసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ సంఘీభావం తెలపనున్నట్లు స్పష్టం చేసింది.
అమరావతి రైతులతో కలిసి పాదయాత్రలో కలిసి నడవనున్న జనసేన నేతలు
అంతేకాదు నెల్లూరు జిల్లా నార్త్ రాజుపాలెం వద్ద పాదయాత్రలో కూడా నాదెండ్ల మనోహర్ పాల్గొననున్నట్లు జనసేన పార్టీ ప్రకటించింది. రైతులతో కలిసి సాగించే పాదయాత్రలో జనసేన పార్టీ ముఖ్య నేతలు అందరూ పాల్గొననున్నారు. రాజధాని రైతులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనేకసార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతి నగరమే ఉంటుందని, అమరావతి మార్చేది లేదని ప్రకటించారు. రాజధాని రైతుల పోరాటానికి తాను అండగా ఉంటానని స్పష్టం చేశారు.
Recommended Video
రాజధాని అమరావతినే కొనసాగాలన్న పవన్ కళ్యాణ్
ఇటీవల మూడు రాజధానుల బిల్లు రద్దు సమయంలో కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి నగరమే ఉండాలని తన డిమాండ్ను వినిపించారు. జగన్మోహన్ రెడ్డి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని విషయంలో గందరగోళానికి గురవుతుందని పేర్కొన్న పవన్ కళ్యాణ్, జగన్ ఇప్పటికైనా ప్రజా వ్యతిరేక నిర్ణయాలను మార్చుకోవాలని, ప్రజల ఆకాంక్షల మేరకు రాజధాని అమరావతిని కొనసాగించాలని స్పష్టం చేశారు. మరి జనసేన కూడా రాజధాని రైతుల పోరాటానికి మద్దతుగా నిలబడి, యాత్రలో పాల్గొన్న నేపథ్యంలో అమరావతి రైతుల పోరాటానికి బలం పెరిగినట్లు అవుతుంది.