మంగళగిరిలో జనసేన పంద్రాగస్టు సంబరాలు-జెండా ఎగరేసిన పవన్ కళ్యాణ్..
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జాతీయ పతాకావిష్కరణలు జోరుగా సాగుతున్నాయి. రాజకీయ పార్టీల ప్రధాన కార్యాలయాల్లో అధినేతలు పతాకవిష్కరణలు చేస్తున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల త్యాగాల్ని గుర్తుచేసుకుంటున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో భారత స్వాతంత్ర్య అమృతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ ఉదయం త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాలాపన చేసి జైహింద్ అంటూ నినదించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంఛార్జులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులతోపాటు పెద్ద సంఖ్యలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.
Recommended Video
ప్రతీ ఏటా జనసేన ప్రధాన కార్యాలయమైన మంగళగిరి ఆఫీసులో జరిగే వేడుకల్లో జనసేనాన్ని క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. అలాగే ఈసారి కూడా పతాకావిష్కరణ చేపట్టారు. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న జనసేన అమృతోత్సవాలను ఘనంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా జెండా ఆవిష్కరణ కోసం వచ్చిన పవన్ కళ్యాణ్.. ఉత్సాహంగా కనిపించారు. జాతీయ పతాకం బ్యాడ్జ్ ను కుర్తాపై ధరించి సందడి చేశారు.