పెద్ద పోస్ట్కే టార్గెట్ పెట్టిన జనసేన మహిళా నేత: చంద్రబాబు ఓకే అంటారా?
Pawan Kalyan: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. క్రమంగా నామినేటెడ్ పోస్టుల భర్తీపై కసరత్తు సాగిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
రాష్ట్రంలో వివిధ కార్పొరేషన్లు, విభాగాలు, పాలకమండళ్లు, అకాడమీల ఛైర్మన్ పోస్టుల పంపకాలపై కూటమి ప్రభుత్వం ఇప్పుడిప్పుడు చర్చలు సాగిస్తోంది. మూడు పార్టీలతో ప్రభుత్వం ఏర్పాటైనందున.. అన్నింటికి సమాన నిష్పత్తిలో నామినేటెడ్ పోస్టులు ఇవ్వాల్సి ఉంటుంది. కీలక కార్పొరేషన్లను ఎలా పంపకాలు చేయాలనేది ఇప్పుడు ప్రశ్నార్థకమైంది కూటమి సర్కార్కు.

అసెంబ్లీ నియోజకవర్గాలను త్యాగం చేసినందున తమకు నామినేటెడ్ పోస్టుల పంపకాల్లో ప్రాధాన్యత దక్కాలని జనసేన కోరుకుంటోంది. ఎన్నికల సమయంలో తొలుత 40, ఆ తరువాత 30, అక్కడి నుంచి 24 నియోజకవర్గాలకు దిగింది జనసేన. చివరికి అందులో కూడా కోతను ఎదుర్కొవాల్సి వచ్చిందా పార్టీకి. 21 స్థానాలతో సరిపెట్టుకుంది. నామినేషన్ పదవుల పంపకాల్లో మాత్రం ఇలాంటి నంబర్ గేమ్ను అంగీకరించదలచుకోలేదని తెలుస్తోంది.
ఈ పరిణామాల మధ్య జనసేన నాయకురాలు, మాజీ ఎంపీ, దివంగత డీకే ఆదికేశవులు నాయుడు మనవరాలు డీకే చైతన్య ఆదికేశవులు నాయుడు.. పవన్ కల్యాణ్ను కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు ఆయనతో చర్చించారు. నామినేటెడ్ పదవుల భర్తీ కసరత్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఆమె పవన్ను కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

సమావేశం అనంతరం డీకే చైతన్య విలేకరులతో మాట్లాడారు. తనకు ఎలాంటి పదవి ఇచ్చినా సంతోషంగా స్వీకరిస్తానని అన్నారు. ప్రజలకు సేవ చేయడానికి తన తాతగారి అడుగు జాడల్లో నడవాలని కోరుకుంటోన్నానని చెప్పారు. ఇండస్ట్రీయల్, రియల్ ఎస్టేట్ నేపథ్యం తనకు ఉందని, తనకు ఇచ్చిన పదవిలో ఎలా రాణించాలనే విషయంపై స్పష్టత ఉందని అన్నారు.
మొన్నటి ఎన్నికల్లో 21 మంది ఎమ్మెల్యేలు, రెండు ఎంపీలు గెలిచారని, ఇది ప్రతి జనసైనికుడు, వీర మహిళకు గర్వకారణమని చైతన్య ఆదికేశవులు నాయుడు అన్నారు. తనకు కేటాయించిన రంగాన్ని అభివృద్ధి చేయడానికి, అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేర్చడానికి అవసరమైన అర్హతలు ఉన్నాయని వివరించారు.
తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (తుడా) ఛైర్ పర్సన్ పదవిని లభించేలా అందరూ ఆశీర్వదించాలని డీకే చైతన్య విజ్ఞప్తి చేశారు. ఇది కాకుండా ఇంకే పదవి ఇచ్చినా చిత్తశుద్ధితో పని చేస్తానని, పెట్టుబడులను ఆకర్షించడానికి తనవంతు చర్యలను తీసుకుంటానని వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications