జనసేనకు కు గాజు గ్లాస్ గుర్తు గాయబ్ : 2025 వరకు సాధ్యం కాదు: ఎన్నికల సంఘం నోటిఫికేషన్..!!
పార్టీలకు గుర్తుల కేటాయింపుపై కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఏపీలోని మూడు ప్రాంతీయ పార్టీలకు రిజర్వుడ్ గుర్తుల కేటాయింపు జరిగింది. ఏపీతో పాటుగా 8 జాతీయ పార్టీలకూ రిజర్వుడ్ గుర్తులు ఖరారు చేసింది. అయితే, వాటిలో జనసేన పార్టీ పేరు ప్రస్తావన లేదు. దీంతో..జనసేన సింబల్ గా ఉన్న గాజు గ్లాసు ఇక ఉండదని చెబుతున్నారు. రాష్ట్రంలో గుర్తింపు కలిగిన ప్రాంతీయ పార్టీల హోదాలో కేవలం మూడు పార్టీలకే రిజర్వుడ్ గుర్తులను కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 23న నోటిఫికేషన్ జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్సార్సీపీకి సీలింగ్ ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తు, టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తులు రిజర్వుడ్ గుర్తులుగా ఉంటాయని పేర్కొంది. జాతీయ పార్టీ హోదాలో బీజేపీ, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ, తృణమూల్ కాంగ్రెస్, బీఎస్పీ, ఎన్సీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీలకు రిజర్వుడ్ గుర్తులుంటాయంది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, ఎంఐఎంలతో పాటు వైఎస్సార్సీపీ, టీడీపీలకూ ఆయా రిజర్వుడ్ గుర్తులు కేటాయించింది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీకి కేటాయించిన గాజు గ్లాస్ గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీచేసిన నోటిఫికేషన్లో ఫ్రీ సింబల్స్ కేటగిరిలో పేర్కొంది.
అంటే.. సంబంధింత గుర్తును రిటర్నింగ్ అధికారులు నిబంధనల ప్రకారం తమ నియోజకవర్గంలో పోటీ చేసే వివిధ రిజిస్టర్డ్ పార్టీ అభ్యర్థులతో పాటు, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసే వారెవరికైనా కేటాయించే వీలుంటుంది. ఇటీవల తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాస్ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించిన విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ గుర్తు చేసింది. కొద్ది నెలల క్రితం జరిగి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేయని కారణంగా జనసేనకు రిజర్వ్ సింబల్ తొలిగించినట్లుగా అధికారులు చెబుతున్నారు.
అయితే, ఆ ఎన్నికల్లో 40 డివిజన్లలో పోటీకి జనసేన సిద్దమైంది. కానీ, గ్రేటర్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ ముఖ్యనేతలు నేరుగా పవన్ వద్దకు వచ్చారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ వద్దని..తమ పార్టీ అభ్యర్దుకుల మద్దతు ఇవ్వాలని కోరారు. దీంతో ఈ విషయం తెలియగానే జనసేన కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది. తాము తెలంగాణలో ఇతర ప్రాంతాల్లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని తమకు గాజు గ్లాసు గుర్తు కొనసాగించాలని కోరింది.
అయితే, తాజాగా ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ లో జనసేన పేరు లేకపోవటంతో గాజు గ్లాసు గుర్తు ఇక ఆ పార్టీకి లేనట్లుగానే చెబుతున్నారు. అదే సమయంలో జనసేన చేసిన అభ్యర్ధనను తిరస్కరిస్తూ ..మరలా 2025 చివరి వరకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కామన్ సింబల్ కేటాయింపుకు అవకాశం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు జనసేన తమ కామన్ సింబల్ పైన ఏ రకంగా ముందుకు వెళ్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
జనసేన కు ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. కామన్ సింబల్ గాజు గ్లాసు గుర్తును రద్దు చేసింది.