తమ్ముడు కంటే అన్నయ్య బెటర్: 120 స్థానాల్లో డిపాజిట్లు లాస్: పవన్కు ఊహించని దెబ్బ..!
Recommended Video
ప్రజారాజ్యం కంటే జనసేన ఎక్కువ ప్రభావం చూపుతోంది. ఎన్నికల ప్రచార సమయంలో విశ్లేషకుల అంచనా. తమ అధినేత పవన్ కింగ్ అవుతారు లేదా కింగ్ మేకర్ ఖాయం. పవన్ మద్దతుతోనే ఎవరైన ముఖ్యమంత్రి అవ్వాల్సిందే. పవన్కు వచ్చిన స్పందన చూసి అభిమానులు అంచనాలు వేసారు. కానీ, ఏపి ఎన్నికల్లో జనసేనకు ఊహించని దెబ్బ తగిలింది. స్వయంగా పవన్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ ఓడారు. ఒకే ఒక్క సీటుతో ఊపిరి పీల్చుకోవాల్సి వచ్చింది. 2009లో ప్రజారాజ్యం ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పుడు జనసేన కంటే మంచి పోటీ ఇచ్చింది.
120 స్థానాల్లో డిపాజిట్లు దక్కలేదు..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన మొత్తం 136 నియోజకవర్గాల్లో పోటీ చేయగా..అందులో 120 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది. ఈ ఫలితాలు పవన్ కు సైతం షాక్ ఇచ్చాయి. రాష్ట్రం మొత్తం మీద అసెంబ్లీ ఎన్నికల్లో 3.13 కోట్ల ఓట్లు పోలైతే, జనసేన పార్టీకి దక్కిన ఓట్లు కేవలం 21 లక్షలు మాత్రమే. ఉభయ గోదావరి జిల్లాలు మినహా మిగిలిన 11 జిల్లాల్లో పార్టీ పోటీచేసిన చాలా నియోజకవర్గాల్లో జనసేనకు దక్కిన ఓట్ల కంటే నోటాకు వచ్చిన ఓట్లే అధికంగా ఉన్నాయి. పవన్ ఎక్కువ ఆశలు పెట్టుకున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లో.. పార్టీకి కంటే నోటాకు ఎక్కువ వచ్చిన ఓట్లు ఆరు దాకా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి, నరసన్నపేట నియోజకవర్గాలతో పాటు విజయనగరం జిల్లాలోని సాలూరు, గజపతి నగరం నియోజకవర్గాలు, విశాఖ జిల్లాలోని మాడుగుల, పాడేరు నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎదురైంది. పాడేరులో జనసేన పార్టీ కంటే స్వతంత్ర అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి.

ప్రజారాజ్యం కంటే చాలా తక్కువగా..
2009లో మెగా సోదరులు ముగ్గురు కలిసి ప్రజారాజ్యం తరపున ప్రచారం చేసారు. ఆ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో 18 సీట్లు గెలవగా..13 జిల్లాల్లో 16 సీట్లు గెలిచింది. దాదాపు 18 శాతం ఓట్లు సాధించింది. ప్రజారాజ్యం పార్టీ విశాఖ జిల్లా పెందుర్తి, తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో గెలుచుకుంది. 2019 ఎన్నికల్లో పోటీచేసిన జనసేన ఇక్కడ కనీసం డిపాజిట్లు దక్కించుకోలేదు. ప్రజారాజ్యం పార్టీ 13 జిల్లాల్లోని 16 నియోజకవర్గాల్లో గెలిచి, మరో 34 నియోజకవర్గాల్లో రెండో స్థానం దక్కించుకోగా.. ఈ ఎన్నికల్లో జనసేన తూర్పు గోదావరి జిల్లాలోని ఒక్క రాజోలులో గెలుపొందగా కేవలం మూడు చోట్లే రెండో స్థానంలో నిలిచింది. గాజువాక, భీమవరంతో పాటు నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే రెండో స్థానం దక్కింది. ఇక, ఎన్నికల ఫలితాల పైన వచ్చే నెలలో విశ్లేషణ చేయాలని పవన్ కళ్యణ్ నిర్ణయించారు.












Click it and Unblock the Notifications